Pune Bank Robbery: పుణెలోని మన్ పాడ ప్రాంతంలో ఉన్న ఓ ఐసీఐసీఐ బ్యాంకులో 12 కోట్ల రూపాయల నగదు కొట్టేసిన కేటుగాడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అల్తాఫ్ షేక్ ను పుణెలో పోలీసులు అరెస్ట్ చేసినట్లు బుధవారం విచారణ అధికారి వెల్లడించారు. వేషం మార్చి, కొత్త లుక్ తో జల్సాలు చేస్తున్న నిందితుడిని దొంగతనం జరిగిన రెండున్నర నెలల తర్వాత పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి 9 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం థానే, నవీ ముంబై పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి షేక్ ను అరెస్ట్ చేశారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఈ భారీ చోరీకి నిందితుడు భారీ ప్లానే వేశాడు. 


ఐసీఐసీఐ బ్యాంకులో బురఖా వేసుకొని చోరీ..


ముంబైకి చెందిన షేక్ ఐసీఐసీఐ బ్యాంకులో కస్టోడియన్ గా పని చేశాడు. కస్టోడియన్ అంటే లాకర్ తాళాలకు కేర్ టేకర్ గా ఉండే వాడు. బ్యాంకులో ఉన్న నగదు చూసి అతనికి బుద్ధి పక్కదారి పట్టింది. ఎలాగైనా సొమ్మును తస్కరించాలని గత ఏడాది కాలంగా ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో సిస్టంలోని లూప్ హోల్స్ ని గమనించాడు. అలాగే సీసీటీవీ ఫుటేజీని ట్యాంపరింగ్ చేసి, ఏసీ డక్ట్ ద్వారా మొత్తం దోపిడీని ప్లాన్ చేశాడు. అంతేకాదు తనను ఎవరూ గుర్తించకుండా బురఖా వేసుకొని మరీ నగదు దోచేశాడు. ఈ వ్యవహారంలో సహకరించిన షేక్ సోదరి నీలోఫర్ తో పాటు మరో ముగ్గురు నిందితులు అబ్రార్ ఖురేషీ, అహ్మద్ ఖాన్, అనుజ్ గిరిను పోలీసులు అరెస్ట్ చేశారు. 


అలారం సిస్టంను డీయాక్టివేట్ చేసి..


అలారం సిస్టమ్ ను డీఆక్టివేట్ చేసి, సీసీటీవీని ధ్వంసం చేసిన తర్వాత షేక్ బ్యాంక్ ఖజానాను తెరిచి నగదును కట్టేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఏడాది జులై 12వ తేదీన చోరీ జరిగింది. అయితే డీవీఆర్ సెక్యూరిటీ డబ్బు కూడా కనిపించకుండా పోయిందని సిబ్బంది గ్రహించడంతో ఈ సంఘట వెలుగులోకి వచ్చిందని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు షేక్ ను అరెస్ట్ చేసి చోరీకి గురైన మొత్తం 12.20 కోట్లతో సుమారు 9 కోట్లను రికవరీ చేయగలిగారు. మిగిలిన మొత్తాన్ని త్వరలోనే రికవరీ చేస్తామని చప్పారు. ఈ కేసులో మరింత మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని, విచారణ కొనసాగుతోందని అధికారి చెప్పుకొచ్చారు. 


రెండు నెలల క్రితం నిజామాబాద్ బ్యాంకూలోనూ..


నిజామాబాద్ జిల్లాలో రెండు నెలల క్రితం బ్యాంకును దోచేశారు దుండగులు. సినీ ఫక్కీలో చోరీ చేశారు. ఆ చోరీ జరిగిన విధానం చూస్తే సినిమాల్లో చూపించిన విధంగానే ఉందంటున్నారు. జిల్లాలోని మెండోర మండలం బుస్సాపూర్ గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు షట్టర్లను రాడ్లతో లేపి లోపలికి ప్రవేశించారు. బ్యాంకులో ఉన్న స్ట్రాంగ్ రూమును గ్యాస్ కట్టర్లతో కోసి లోపలికి ప్రవేశించారు. లాకర్లలో ఉన్న రూ.7.30 లక్షల నగదు, 3 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. 


అలారం సెన్సార్ ధ్వంసం చేసి..


సోమవారం ఉదయం బ్యాంక్ సిబ్బంది వచ్చి బ్యాంక్ షట్టర్లు తెరిచి ఉన్నట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో వేలిముద్రలు సేకరించారు. ఈ దొంగతనం శనివారం రాత్రి జరిగిందా లేక ఆదివారం రాత్రి జరిగిందా అన్న  కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అంతర్రాష్ట్ర దొంగలు ముఠానే ఈ దొంగతనానికి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. బ్యాంకులోని అలారం సెన్సార్ ను ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డట్లు తెలుస్తోంది. దొంగతనం చేసిన అనంతరం సీసీ కెమెరాకు సంబంధించిన డిజిటల్ వీడియో రికార్డు(డీవీఆర్)ను సైతం దొంగలు ఎత్తుకెళ్లారు.