Travel Bus Fire In Tirupati: తిరుపతి (Tirupati) జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి - తిరుపతి హైవేపై ఆదివారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. రేణిగుంట (Renigunta) మండలం వెదళ్లచెరువు వద్ద బెంగుళూరు నుంచి అమలాపురం వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సు నిలిపేసి ప్రయాణికులను దించేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాయంతో బస్సులో మంటలు అదుపు చేశారు. అయితే, అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో 12 మంది ప్రయాణికులున్నారు. ఈ ఘటనతో అంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. స్థానిక పోలీసులు చొరవ తీసుకుని ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు పంపారు. ఈ ప్రమాదంపై రేణిగుంట అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


ఏలూరులోనూ


మరోవైపు, ఏలూరు (Eluru) జిల్లా నూజివీడు (Nuzividu) మండలం మీర్జాపురంలో ఓ ఆయిల్ ట్యాంక్ బోల్తా పడింది. ఆయిల్ లీకై డ్రైనేజీల్లో మంటలు చెలరేగడంతో మంటలు అంటుకున్నాయి. స్థానికంగా ఉండే ఓ టైర్ షాపునకు కూడా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలు ఆర్పారు. అయితే, స్థానికంగా ఓ పెట్రోల్ బంక్ ఉండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంతో నూజివీడు - హనుమాన్ జంక్షన్ రహదారిపై ట్రాఫిక్ భారీగా నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


Also Read: Visakha News: మద్యం మత్తులో యువకుడి వీరంగం - కానిస్టేబుల్ చొక్కా పట్టుకొని హల్చల్