Private travels bus overturned at Outer Ring Road in Hyderabad | హైదరాబాద్: నగర ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బస్సు చక్రాల కింద నలిగిపోయి దుర్మరణం చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న పలువురుకి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముంబాయి వెళుతోంది. ఈ క్రమంలో నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో బోల్తా పడింది.


పోలీసులు నార్సింగ్ ఓఆర్ఆర్ వద్దకు చేరుకుని పరిశీలించారు. ట్రావెల్స్ రోడ్డుకు అడ్డంగా ఉండటంతో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినట్లు సమచారం. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలిస్తున్నారు. పోలీసులు గాయపడిన ప్రయాణికులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. క్రేన్ సహాయంతో సిబ్బంది బస్సును తొలగిస్తున్నారు.


ప్రమాదానికి కారణం ఏంటీ?
హైదరాబాద్ ఓఆర్ఆర్ మీద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. డ్రైవర్ మద్యం సేవించి ట్రావెల్స్ నడిపాడని తెలుస్తోంది. యాక్సిడెంట్ జరిగిన తరువాత డ్రైవర్ కు డ్రంకన్ డ్రైవ్ టెస్టులు చేయగా రీడింగ్ చాలు పాయింట్ల వరకు చూపించినట్లు అక్కడున్న వారు చెబుతున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో వేగంగా బస్సు నడపడంతో డివైడర్ ను ఢీకొట్టి, వాహనం బోల్తా పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.