Police Investigation On Chilamathur Abused Case: శ్రీ సత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో హిందూపురం త్యాగరాజ్ కాలనీకి చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు చిల్లర దొంగతనాలు చేసే ముఠాగా గుర్తించారు. వారిని ఓ రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుల్లో మైనర్లు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారి కోసం గాలింపు చేపట్టారు. కాగా, ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 


ఇదీ జరిగింది


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యసాయి జిల్లా (Satyasai District) చిలమత్తూరు (Chilamathur) మండలంలోని ఓ గ్రామంలో శనివారం అత్తాకోడలిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు కుటుంబ సభ్యులను కత్తులతో బెదిరించి ఈ దారుణానికి ఒడిగట్టారు. కర్ణాటకలోని బళ్లారికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉపాధి నిమిత్తం గ్రామానికి వచ్చారు. ఓ నిర్మాణం వద్ద వీరంతా వాచ్‌మెన్, ఇతర విధులను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు 2 ద్విచక్రవాహనాల్లో వచ్చి.. నిర్మాణం వద్ద నివాసం ఉంటున్న అత్త కోడలిని కత్తులతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డు వచ్చిన తండ్రి కుమారుడిని బెదిరించారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. దీనిపై బాధితులు చిలమత్తూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 


వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ రత్న ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. పగలగొట్టిన సీసీ కెమెరాలు, కత్తిని స్వాధీనం చేసుకుని.. దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనా స్థలంలో కండోమ్ ప్యాకెట్లు లభించినట్లు తెలుస్తోంది. దుండగులు పక్కా ప్లాన్‌తోనే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.


'నిందితులపై కఠిన చర్యలు'


పండుగ వేళ మహిళలపై ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన ఆయన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులకు తాను, ప్రభుత్వం అండగా ఉంటామని స్పష్టం చేశారు. అటు, రాష్ట్ర హోంమంత్రి అనిత సైతం ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు. బాధిత మహిళలకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సూచించారు.


Also Read: Devaragattu: ఉత్సవమూర్తుల కోసం పోరాటం - దేవరగట్టు కర్రల సమరం, 70 మందికి గాయాలు