హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో దివంగత పరిటాల రవి చిన్న కుమారుడు పరిటాల సిద్ధార్థ్ బ్యాగ్‌లో దొరికిన బు‌ల్లెట్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. శుక్రవారం పరిటాల సిద్దార్థ్ శ్రీనగర్ వెళ్లే విమానం ఎక్కేందుకు బ్యాగ్‌తో ఎయిర్‌పోర్టుకు వచ్చారు. బ్యాగ్ స్కానింగ్ సమయంలో బుల్లెట్ ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో బుల్లెట్‌తో పాటు సిద్ధార్థ్‌ను పోలీసులకు అప్పగించారు. తనకు అనంతపురం జిల్లాలో గన్ లైసెన్స్ ఉందని వాటికి సంబంధించి తాను కొనుగోలు చేసిన బుల్లెట్ అదని పోలీసులకు చెప్పారు. బ్యాగులో బుల్లెట్ ఉందని చూసుకోలేదని వివరించారు. దీంతో గన్ లైసెన్స్‌తో పాటు బుల్లెట్లు కొనుగోలు చేసిన వివరాలు ఇవ్వాలని సీఆర్పీసీ సెక్షన్ 41కింద నోటీసులు జారీ చేసి వదిలి పెట్టారు. 


అయితే ఇప్పుడు ఆ బుల్లెట్ అంశంపై రకరకాల వివరాలు బయటకు వస్తున్నాయి. మూడేళ్ల కిందట పరిటాల సిద్ధార్థకు పాయింట్ 32 క్యాలిబర్ గన్‌కు లైసెన్స్‌ను అధికారులు ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన ఆ గన్‌ను పోలీస్ స్టేషన్‌లో డిపాజిట్ చేశారు. మళ్లీ పోలీసులు లైసెన్స్ పునరుద్ధరించలేదు.. ఆ గన్‌ను కూడా ఇవ్వలేదు. అదే సమయలో బ్యాగ్‌లో దొరికిన బుల్లెట్ పాయింట్ 32 క్యాలిబర్ గన్‌లో ఉపయోగించేది కాదని పోలీసులు భావిస్తున్నారు. బ్యాగేజ్‌లో లభించినవి 5.56 క్యాలిబర్‌ తూటాలుగా అనుమానిస్తున్నారు. వీటిపై ఐటీబీపీ ముద్ర ఉండటంతో సాయుధ బలగాలు వాడేవిగా భావిస్తూ.. పరిశీలనకు పంపించారు. 
 
ఈ ఏడాది ఏప్రిల్‌లో బెంగాల్‌లోని సిలిగురిలోని బాగ్ డోగ్రా విమానాశ్రయంలో ఓ ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్ ఐటీబీపీలో పని చేసే ఓ జవాన్‌ ఉపయోగించని వంద బుల్లెట్లను తీసుకెళ్తూండగా పట్టుబడ్డారు. ఆ జవాన్ అనంతపురం జిల్లాకు చెందిన వారు. విధుల నుంచి స్వస్థలానికి వచ్చేందుకు బెంగళూరు విమానం ఎక్కే సమయంలో ఆయన బ్యాగులో బుల్లెట్లు దొరికాయి. ఆ ఘటనపై ఐటీబీపీ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఆ జవాన్ అనంతపురం జిల్లాకు చెందిన వారు కావడం.. ఇప్పుడు అలాంటి బుల్లెట్‌నే పరిటాల సిద్ధార్థ్ బ్యాగులో దొరికిందన్న ప్రచారం నేపధ్యంలో రెండింటికి లింక్ ఉందన్న ప్రచారం ఊపందుకుంది. 
 
పరిటాల సిద్దార్థ్ వద్ద దొరికిన బుల్లెట్ వ్యవహారంపై పోలీసులు ఇంత వరకూ అధికారిక ప్రకటన చేయలేదు.  ఈ అంశంపై పరిటాల కుటుంబం కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. పోలీసులు ఇచ్చిన సీఆర్పీసీ 41 నోటీసుకు అనుగుణంగా వివరాలు ఇచ్చేందుకు పరిటాల సిద్ధార్థ్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ అంశం సున్నితమైనది కావడంతో పోలీసు ఉన్నతాధికారులు కూడా ఎలాంటి సమాచారం బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.