టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదినం ఆగష్టు 22. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులకు ఓ పిలుపునిచ్చారు. అందరూ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో పాల్గొనాలని ట్విటర్ ద్వారా అభిమానులను కోరారు. ప్రకృతి వైపరిత్యాలు తగ్గాలంటే, కాలుష్యాన్ని తగ్గించాలని అనుకున్నా మొక్కలు అనివార్యమని అన్నారు. భవిష్యత్ తరాలు బావుండాలంటే మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని చెప్పారు. అందుకు, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన హరిత యజ్ఞం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో అందరూ పాల్గొనాలని కోరారు. ఒక్కొక్కరూ మూడు మొక్కలు నాటి తనకు ట్విటర్‌లో ట్యాగ్ చేయాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు.


‘‘తల్లిలాంటి ప్రకృతికి మనం ఎప్పుడూ రుణ పడి ఉంటాం. క్లైమేట్ ఛేంజ్, కాలుష్యం వంటి వాటిని అరికట్టేందుకు మొక్కలు నాటి, పెంచాలి. ఈ సంవత్సరం నా పుట్టిన రోజు సందర్భంగా అందరూ 3 మొక్కలు నాటండి. ఆ ఫోటోలను నాకు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయండి. ఎంపీ సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు మద్దతు తెలపండి’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.






అయితే, చిరంజీవి ట్వీట్‌పై స్పందించిన ఎంపీ సంతోష్ కుమార్ మెగాస్టార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రకృతి పరిరక్షణపై మెగాస్టార్‌కి ఉన్న ప్రేమను తెలియజేస్తుందని, ఆయన పుట్టిన రోజున అభిమానులంతా మొక్కలు నాటి ఈ చిరు కానుకను అందించాలని ఆకాంక్షించారు. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో పాల్గొనే ప్రతి అభిమాని చిరుకు ట్యాగ్ చేయాలని సంతోష్ కుమార్ సూచించారు. తన నటనతో కోట్లాది మంది హృదయాలను గెలిచిన మెగాస్టార్ ఆయురారోగ్యాలతో కలకాలం అభిమానులను అలరించాలని ఆకాంక్షించారు.


‘‘మెగాస్టార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీ పుట్టిన రోజు నాడు ఈ ఆలోచన చాలా బాగుంది. మీరు ఇలా 3 మొక్కలు నాటాలని మీ అభిమానులకు చెప్పడం.. దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలలో ప్రశంసలు అందుకుంటుంది. ప్రకృతిని మరింత సుందరంగా మార్చడంలో సహాయపడుతుందని నేను కచ్చితంగా అనుకుంటున్నాను.’’ అని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు.