పంజాగుట్టలో కొద్ది రోజుల క్రితం నాలుగేళ్ల బాలిక అనుమానాస్పద హత్య కేసులో ఎట్టకేలకు మిస్టరీ వీడింది. ఈ కేసుకు సంబంధించిన విషయాలను వెస్ట్‌జోన్‌ డీసీపీ కార్యాలయంలో జాయింట్‌ సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ శనివారం కేసు వివరాలు వెల్లడించారు. వివాహేతర సంబంధమే ఈ బాలిక హత్యకు కారణంగా పోలీసులు గుర్తించారు. భర్త జైలుకు వెళ్లగా ఆ బాధన్నదే లేకుండా మరో వ్యక్తి మోజులో పడి అతడితో లాడ్జిల్లో గడుపుతూ పూటుగా మద్యం తాగడమే కాకుండా నాలుగేళ్ల కూతురును ఇష్టం వచ్చినట్లు తల్లి కొట్టేదని వివరించారు. తన పడక సుఖానికి అడ్డుగా ఉందన్న కోపంతో ఆ పాపను ప్రియుడు కడుపులో తన్నినట్లు పోలీసులు వెల్లడించారు. అయినా తల్లి ఏమీ అనకుండా ఉండేదని వివరించారు. శరీరంలోని అంతర్గత అవయవాల్లో తీవ్ర రక్తస్రావమై చిన్నారి చనిపోతే.. ఎక్కడో ఓ చోట పడేయాలని పథకం వేసినట్లు వివరించారు. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్‌, న్యూ హఫీజ్‌పేటకు చెందిన మహ్మద్‌ అహ్మద్‌, హీనాబేగం దంపతులకు కుమారుడు ఏడేళ్ల కుమారుడు అఫ్ఫాన్‌, నాలుగేళ్ల కూతురు మెహక్‌, మాహెరా అనే మరో మూడేళ్ల కుమార్తె ఉన్నారు. ఓ చోరీ కేసులో మహ్మద్‌ అహ్మద్‌ను ఆర్నెల్ల క్రితం పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. హీనా బేగంకు కల్లు కాంపౌండ్‌లో డబీర్‌ పురాకు చెందిన షేక్‌ మహ్మద్‌ ఖాదర్‌ అలియాస్‌ రిజ్వాన్‌ పరిచయమయ్యాడు. అది అతనితో అక్రమ సంబంధానికి దారితీసింది. 


పిల్లలు అఫ్ఫాన్‌, మాహెరాను బంధువుల వద్ద వదిలిపెట్టిన హీనాబేగం, మెహక్‌ను వెంటబెట్టుకొని ప్రియుడితో వెళ్లిపోయింది. తాను అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరం పడిందని తల్లిని అడగ్గా.. ఆమె పెద్ద మనసుతో కూతురుకి ఏకంగా మూడు లక్షల రూపాయలు పంపింది. ఆ డబ్బులు మొత్తం అయిపోయే వరకూ ఓ త్రీ స్టార్‌ హోటల్‌ గదిలో రిజ్వాన్‌, హీనా బేగం పీకలదాకా తాగి జల్సాలు చేశారు. తర్వాత చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో బిచ్చగాళ్ల అవతారం ఎత్తారు. 


అలా బెంగళూరు, ముంబయికి కూడా వెళ్లి అక్కడి వీధుల్లో ఇద్దరూ అడుక్కునేవారు. అంతేకాక, నాలుగేళ్ల పాపతోనూ భిక్షాటన చేయించేవారు. రోజుకు రూ.2 వేలు వస్తే రూ.700 ఖర్చు పెట్టి లాడ్జిలో గది తీసుకొని మిగతా మొత్తంతో మద్యం తాగేవారు. ఈ క్రమంలోనే తమ సుఖానికి అడ్డుగా ఉందన్న కారణాలతో మెహక్‌ను తీవ్రంగా కొట్టేవారు.


బెంగళూరులో పాప హత్య
బెంగళూరులోని ఓ లాడ్జ్‌లో ఉండగా.. నవంబరు 3న తాగిన మత్తులో మెహక్‌ను రిజ్వాన్‌ కడుపులో బలంగా తన్నాడు. దీంతో బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. తొలుత చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని భావించినా, పోలీసులకు దొరికిపోతామని ఆగిపోయారు. అలా ముందస్తుగా వేసుకున్న పథకం ప్రకారం.. బెంగళూరు నుంచి బస్సులో హైదరాబాద్‌కు వచ్చారు. మధ్యలోనే చిన్నారి చనిపోయింది. రాత్రి 10.30 ప్రాంతంలో ఎంజీబీఎస్‌ ప్రాంతంలో బస్సు దిగి.. అక్కడి నుంచి ఆటోలు మారుతూ పంజాగుట్టకు వచ్చారు. అక్కడ మూసివేసిన ఓ దుకాణం ముందు పాప మృతదేహాన్ని పడేశారు. ఆ వెంటనే ఎవరికీ అనుమానం రాకుండా బెంగళూరుకు, అక్కడినుంచి జైపూర్‌కు వెళ్లిపోయారు. 


ఈ కేసులో పోలీసులు వందల సంఖ్యలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాల్సి వచ్చింది. దాదాపు 30 మందికి పైగా ఆటో డ్రైవర్‌లను గుర్తించి విచారణ జరిపారు. అంతేకాకుండా నిందితుల కాల్‌ డేటాను విశ్లేషించి వారే నిందితులని తేల్చారు. చివరికి ఆచూకీ గుర్తించి నిందితులు జైపూర్‌ నుంచి ఢిల్లీ వెళుతుండగా అరెస్టు చేశారు.


Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!


Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..


Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి