Palnadu News : పల్నాడు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కృష్ణా నదిలో ఈతకు దిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. అమరావతి ఆలయ సమీపంలోని కృష్ణా నదిలో ఈతకు దిగారు ఇద్దరు యువకులు. పెదకూరపాడు మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన కేసర రాజశేఖర్ రెడ్డి , కోల్లి మల్లికార్జున్ రెడ్డి (17) ఇరువురు నదిలో గల్లంతయ్యారు. వీరివురూ గుంటూరులోని ప్రైవేటు కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు స్వగ్రామానికి వచ్చారు.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేసవి సెలవులతో సమీపంలో ఈతకు వెళ్లిన యువకులు నదిలో మునిగిపోవడంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. పిల్లలు ఏంచేస్తున్నారో తల్లిదండ్రులు కాస్త అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. 


ఎనిమిదేళ్ల కుమారుడ్ని గొంతు నులిమి కెనాల్ పడేసిన మహిళ


ఆమెకు ఇప్పటికే మద్యం తాగే అలవాటు ఉంది. ఇది చాలదన్నట్లు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడింది. తన ఆనందాల కోసం ఏమైనా చేసేది. అయితే తన సంతోషాలకు కుమారుడు అడ్డొస్తున్నాడని ఎనిమిదేళ్ల కుమారుడి గొంతునులిమి హత్య చేసింది. ఆపై కెనాల్ లో పడేసింది. మద్యం మత్తులో ఉన్న ఆమె అదే కెనాల్ వద్ద తెల్లారేదాకా కూర్చింది. చివరకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కబెడుతోంది. 


అసలేం జరిగిందంటే..?


నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం దాస్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని నాగారం సమీపంలో గల సంతోషన్ నగర్ కాలనీలో లావణ్య, భరత్ అనే దంపతులు నివాసం ఉండేవాళ్లు. అయితే వీరికి రోహిత్ అనే ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. లావణ్య మద్యానికి బానిస కావడంతో పాటు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడింది. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం లావణ్య కుమారుడిని తీసుకొని ఇంటి నుంచి బయలుదేరింది. తన విలాసాలకు అడ్డు వస్తున్నాడని భావించిన తల్లి.. మద్యం మత్తులో రోహిత్ గొంతు నులిమి చంపేసింది. ఆపై నిజాంసాగర్ కెనాల్ లో పడేసింది. అప్పటికీ ఆమెకు మత్తు దిగకపోయేసరికి రాత్రంతా అదే కెనాల్ వద్ద ఉండిపోయింది.


అయితే లావణ్య కెనాల్ వద్ద ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. లావణ్యన ఆరా తీయగా భర్త గురించి చెప్పింది. దీంతో పోలీసులు ఆమె భర్తకు సమాచారం అందించారు. వెంటనే భరత్ పీఎస్ కు వచ్చాడు. బాబు ఏడని లావణ్యను ప్రశ్నించగా.. పొంతనలేని సమాధానాలు చెప్పింది. ఈక్రమంలోనే భార్యే ఏదైనా చేసి ఉంటుందని భరత్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని వాచరణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజం తెలిసింది. తన సరదాలకు అడ్డొస్తున్నాడని కుమారుడు రోహిత్ ను తానే చంపినట్లు తెలిపింది. దీంతో కెనాల్ లో వెతకగ్గా.. బాలుడి మృతదేహం లభ్యం అయింది. పోస్టుమార్టం నిమిత్తం రోహిత్ మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే లావణ్య ఒక్కతే బాలుడని చంపిందా, మరెవరైనా సాయం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.