Ongole News: ప్రకాశం జిల్లా ఒంగోలులో విషాదం చోటుచేసుకుంది. ఎం వెంకటేశ్వర్లు అనే ఓ ఏఆర్ కానిస్టేబుల్ తన వద్ద తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఒంగోలు కోర్టు సెంటర్ సమీపంలో ఆంధ్రాబ్యాంక్ వద్ద కాపలా ఉన్న ఆయన.. ఈరోజు మధ్యాహ్నం తన వద్ద ఉన్న తుపాకీతో తనను తాను కాల్చుకొని చనిపోయాడు. అయితే విషయం గుర్తించిన స్థానికులు బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చారు. బ్యాంకు అధికారులు పోలీసులకు తెలిపారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు రక్తపమడుగులో పడిన ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే మృతుడు వెంకటేశ్వర్లు చీమకుర్తికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఒంగోలులో ఉంటూ విధులు నిర్వహిస్తుండగా.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అతను ఎందుకు అలా కాల్చుకొని చనిపోయాడన్న విషయం గురించి మాత్రం తెలియరాలేదు.  


ఇటీవలే వికారాబాద్ లోనూ ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య



వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూప్ ఖాన్ పేట గ్రామానికి చెందిన 30 ఏళ్ల వెంకటేశ్ అనే యువకుడు కానిస్టేబుల్ ఉద్యోగం సంపాధించాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఎంసీ సెక్షన్లో ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే కుమారుడికి పెళ్లి వయసు రావడం, బాగా సెటిలవడంతో తల్లిదండ్రులు పెళ్లి చేయాలనుకున్నారు. ఈ క్రమంలోనే అతడికి నచ్చిన షాద్ నగర్ కు చెందిన ఓ అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేశారు. ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగింది. మూడ్రోజుల క్రితమే అతడు గచ్చిబౌలి నుంచి స్వగ్రామానికి వచ్చాడు. ఈక్రమంలోనే అమ్మాయి కుటుంబ సభ్యులకు అతడి ప్రేమ వ్యవహారం గురించి తెలిసింది. ప్రజలను కాపాడి, అందరికీ బుద్ధులు చెప్పాల్సిన పదవిలో ఉన్న అతడే తమను మోసం చేశాడని.. పోలీసులకు ఫిర్యాదు చేశారు అమ్మాయి తల్లిదండ్రులు. 


తమ మధ్య ఎలాంటి బంధం లేదని బాండ్ పేపర్లు రాయించిన వెంకటేష్


విషయం తెలుసుకున్న వెంకటేష్ అవన్నీ పుకార్లని చెప్పాడు. వెంటనే పెద్దలను పిలిపించి మేనత్తను, ఆమె కూతురిని కూడా తీసుకొచ్చి తమ మధ్య ఎలాంటి బంధం లేదని చెప్పించాడు. నోటరీ పేపర్లపై కూడా తమ మధ్య ఎలాంటి బంధం లేదని రాయించి ఇచ్చాడు. సమస్యంతా తీరిపోయిందనుకొని అంతా ఎవరి ఇళ్లకు వారు వెళ్లారు. ఏమైందో తెలియదు కానీ వెంకటేష్ పొలంలోని ఓ చెట్టుకు ఉరివేసుకొని చనిపోయాడు. దారిన వెళ్లే వారు విషయం గుర్తించి అతడిని కిందకు దించారు. కానీ అప్పటికీ ఆయన మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంకొన్ని రోజుల్లో పెళ్లి చేసుకొని హాయిగా గడపాల్సిన కుమారుడు అచేతనంగా పడి ఉండడం చూసి ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోతున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారుడిపై అమ్మాయి తరపు వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్లే పరువు పోయిందని భావించి తమ కుమారుడు ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అంటున్నారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంకటేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయి తరఫు వాళ్లు మళ్లీ ఏమైనా అన్నారా, లేక ఈయన పరువు పోయిందని భావించి ఆత్మహత్య చేసుకున్నాడా అని తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు.