Nursing Student Suspicious Death In Hyderabad: హైదరాబాద్‌ గచ్చిబౌలి (Gachibowli) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ నర్సింగ్ విద్యార్థిని హోటల్ రూంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు (Judcherla) చెందిన విద్యార్థిని (23).. హైదరాబాద్‌లో (Hyderabad) గణేష్ వేడుకలను చూసేందుకు రెండు రోజుల క్రితం ముగ్గురు స్నేహితులతో కలిసి నగరానికి వచ్చారు. వీరిలో ఓ యువతి, ఇద్దరు యువకులు ఉన్నారు. వీరంతా చిన్న అంజయ్యనగర్‌లోని ఓ హోటల్‌లో దిగారు. ఆదివారం రాత్రి భోజనం అనంతరం స్నేహితులు బయటకు వెళ్లారు. తనకు తలనొప్పిగా ఉందని వారి వెంట వెళ్లకుండా విద్యార్థిని హోటల్ గదిలోనే ఉండిపోయింది. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు స్నేహితులు వచ్చి గది తలుపులు కొట్టగా తీయలేదు.


హోటల్ సిబ్బందికి తెలియజేయగా వారు మాస్టర్ కీ సాయంతో తలుపులు తీశారు. విద్యార్థిని లోపల ఫ్యానుకు ఉరి వేసుకుని కనిపించడంతో అంతా షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తమ కుమార్తెపై అత్యాచారం చేసి హత్య చేశారని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గదిలో రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. గది మొత్తం చిందర వందరగా ఉండడంతో గొడవ జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గదిలో పెద్ద ఎత్తున బీరు బాటిల్స్ ఉన్నట్లు గుర్తించారు. గదిలో మొత్తం ముగ్గురు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తుండగా.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.


అనుమానం పెనుభూతమై..


ఓ వ్యక్తి అనుమానంతో భార్యను హతమార్చిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్యాస్ డెలివరీ బాయ్‌గా పని చేసే నర్సింహులు అనే వ్యక్తికి 13 ఏళ్ల క్రితం ఇందిరతో వివాహం జరిగింది. తన భార్యపై అనుమానంతో నగరంలోనే ఆమెను హత్య చేసిన నిందితుడు మృతదేహాన్ని స్వస్థలం ఆందోల్‌కు తీసుకొచ్చాడు. తన భార్య గుండెపోటుతో చనిపోయిందంటూ కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారికి అనుమానం వచ్చి గట్టిగా నిలదీయడంతో హత్య చేసినట్లు ఒప్పుకొన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారించారు. తాను లేనప్పుడు ఓ పోలీస్ అధికారి తరచూ ఇంటికి వచ్చే వాడని పోలీసులకు తెలిపాడు. తన భార్య గంటల తరబడి అతనితో ఫోన్‌లో మాట్లాడేదని.. వివాహేతర సంబంధం ఉండడం వల్లే ఆమెను హత్య చేసినట్లు చెప్పాడు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Jani Master: జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...