Nizamabad News: నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళుతుండగా మార్గమధ్యలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎమ్మెల్యే తృటిలో తప్పించుకున్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా ఆదివారం పలు కార్యక్రమాలకు హాజరయ్యేందుకు నగరానికి వచ్చారు. అనంతరం పని ముగించుకొని హైదరాబాద్ కు వెళ్తుండగా, కామారెడ్డి జిల్లాలోని సిరిసిల్ల రోడ్డు జాతీయ రహదారి ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఎమ్మెల్యే కారు, వెనకాల ఉన్న కాన్వాయ్ ని వెనుక నుంచి వచ్చిన మరో కారు ఢీ కొట్టింది. దీంతో ఎమ్మెల్యే కాన్వాయ్ వాహనం దెబ్బతినగా.. మరో వాహనంలో హైదరాబాద్ కు వెళ్లిపోయారు. 
ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కాన్వాయ్ వాహనం మధ్యలోకి రెండు ప్రైవేట్ కార్లు రావడం వల్లే ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న కామారెడ్డి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎమ్మెల్యే కాన్వాయ్ దెబ్బతినగా, ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు చెందిన సెక్యూరిటీ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం వెంటనే నిజామాబాద్‌కు తరలించారు.