హైదరాబాద్‌లో ఇటీవలి కాలంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలకు ఓ సారూప్యత ఉంటోంది. నేపాల్ కు చెందిన వ్యక్తులే ఈ నేరాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. తాజాగా నగరంలోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద నగర్ లో భారీ చోరీ జరిగింది. ఇంటికి వాచ్ మ్యాన్ గా పని చేస్తూ రక్షణ కల్పించాల్సిన ఓ నేపాలీ అదే ఇంటికి కన్నం వేశాడు. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కూకట్‌పల్లి వివేకానంద నగర్ లో వడ్డేపల్లి దామోదర్ రావు ఇంట్లో 8 నెలల క్రితం చక్రధర్ అనే నేపాలీ తన భార్య సీత, మూడేళ్ళ కుమారుడితో కలిసి వాచ్ మెన్ గా చేరాడు. అప్పటి నుండి నమ్మకంగా పని చేస్తున్న వారు ఈ నెల 6వ తేదీన తమ బంధువుల వద్దకు వెళ్తున్నామని నాగపూర్ వెళ్ళి, తిరిగి వచ్చే సమయంలో తమతో పాటు ఓ గుర్తు తెలియని వ్యక్తిని తీసుకొని వచ్చారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో దామోదర్ రావు కుటుంబ సభ్యులందరూ కొంపల్లిలో ఓ ఫంక్షనుకు వెళ్ళారు. ఇదే అదనుగా భావించిన చక్రధర్, గుర్తు తెలియని వ్యక్తి ఇంటి తలుపు పగులగొట్టి లోనికి ప్రవేశించి ఏకంగా రూ.30 లక్షల రూపాయల నగదు, 25 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు తీసుకొని ఉడాయించారు.


ఆటోలో కుటుంబంతో సహా వీరంతా ఒకేసారి పరారయ్యారు. ఇంటికి తిరిగి వచ్చిన దామోదర్ రావు ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సీసీటీవీ కెమెరాల ఆధారంగా దొంగలు లక్డీకాపూల్ వరకు వెళ్లారని గుర్తించారు. మాదాపూర్ డీసీపీ అధ్వర్యంలో 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగల కోసం వెతుకుతున్నారు. నిందితులు ఎటు వెళ్లి ఉంటారనే అంచనాలను బట్టి బెంగళూరు, పుణె వంటి నగరాలకు ప్రత్యేక టీమ్‌లను పంపారు. దొంగల్ని పట్టుకొనేందుకు ముమ్మర గాలింపు సాగుతోంది.