రెండు పార్టీల మధ్య మొదలైన గొడవ చివరకు ఊరుని ఖాళీ చేసింది. ఊరిలో పోలీస్ పికెట్ ఏర్పాటుకి కారణం అయింది. ప్రస్తుతం ఆ ఊరిలో ఏ క్షణం ఏం జరుగుతుందో అని జనం భయపడిపోతున్నారు. ఊరంతా నిశ్శబ్దం ఆవహించింది. దీనికి కారణం వినాయక చవితి కావడం విశేషం. 


మొన్న కుప్పం, నిన్న విజయవాడ, నేడు నెల్లూరు.. రాష్ట్రంలో వరుసగా టీడీపీ నేతలపై వైసీపీ దాడులు పెరిగిపోయాయనే ఆరోపణలు వినపడుతున్నాయి. నెల్లూరు జిల్లాలో ఈ గొడవ వినాయక విగ్రహాల దగ్గర మొదలు కావడం విశేషం. టీడీపీ నేతలు పెట్టిన వినాయకుడి బొమ్మ నిమజ్జనం సమయంలో వైసీపీ నాయకులు అడ్డుపడి, వారి ట్రాక్టర్ ని అడ్డంగా పెట్టడంతో అర్థరాత్రి వరకు టీడీపీ నాయకులు బొమ్మతో రోడ్డుపైనే నిలబడిపోవాల్సి వచ్చింది. అక్కడ మొదలైన గొడవ చివరకు చినికి చినికి గాలివానలా మారి పొలం దగ్గర కొట్లాట వరకు వెళ్లింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బండారుపల్లిలో జరిగింది. టీడీపీ నాయకుడు, ఆయన భార్యపై వైసీపీ నేతలు కాపుకాసి దాడి చేశారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో పోలీస్ పికెట్ నడుస్తోంది. ఇరు వర్గాలు ఒకరినొకరు రెచ్చగొట్టుకోకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. గాయపడిన బాధితులిద్దర్నీనెల్లూరు ఆస్పత్రికి తరలించారు. 


గతంలో కూడా ఇరు వర్గాల మధ్య పాత కక్షలు ఉన్నాయని, అయితే ఇప్పుడు ఆ గొడవలు వినాయక విగ్రహం నిమజ్జనే వేళ పెరిగి పెద్దవయ్యాయని అంటున్నారు. వినాయక నిమజ్జనం జరిగిన తర్వాత రెండోరోజు మరోసారి గొడవలు జరగడంతో గ్రామంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవర్గంపై మరో వర్గం వారు దాడికి దిగడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. టీడీపీకి చెందిన దంపతులు గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 


అంతా సర్దుకుందంటున్న పోలీసులు.. 
అయితే పోలీసులు మాత్రం వెంటనే ఈ వ్యవహారంలో స్పందించారు. ఇరు వర్గాలను ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కి పిలిపించారు. రెండు వర్గాల వారితో కరచాలనం చేయించారు. ఇకపై గొడవలు పడొద్దని సూచించారు. పోలీస్ స్టేషన్ కి చేరుకున్న ఇరువర్గాలు కొంతసైపు వాదులాడుకున్నా ఆ తర్వాత కలసిపోయినట్టు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు.




అయితే ప్రస్తుతానికి గ్రామంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. బండారుపల్లి గ్రామంలో పోలీస్ పికెట్ ని మరికొన్నిరోజులు కొనసాగించే అవకాశాలున్నాయి. గ్రామస్తులు కలసిపోయినట్టు కనిపించినా, పాత కక్షలు ఉన్నాయి కాబట్టి, పోలీసులు అలర్ట్ గానే ఉన్నారు. మొత్తమ్మీద రాష్ట్రంలో జరుగుతున్న వరుస సంఘటనల కోవలోనే నెల్లూరు జిల్లాలో జరిగిన దాడికి కూడా జరిగిందని అంటున్నారు. ఈ గొడవతో నెల్లూరు జిల్లాలో కూడా రాజకీయ రచ్చ మొదలైంది.