దీపావళి వస్తోంది, పండగ సందర్భంగా బంగారం కొనుగోళ్లు కూడా పెరుగుతాయి. వ్యాపారులు కూడా ఈ సీజన్లో ఖుషీగా ఉంటారు. వివిధ రకాల ఆఫర్లు ప్రకటించి కస్టమర్లను ఆకట్టుకోవాలనుకుంటారు. అలాంటిది నెల్లూరులో మాత్రం బంగారం వ్యాపారులు భయపడిపోతున్నారు. తాజాగా జరిగిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ (డీఆర్ఐ) దాడులతో హడలెత్తిపోతున్నారు.


నెల్లూరు నగరంలోని పలు బంగారం దుకాణాలపై డీఆర్ఐ అధికారులు దాడులు నిర్వహించారు. వ్యాపారానికి సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు ఈ దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. విజయవాడ, గుంటూరు నుంచి 40 మంది అధికారులు ఏక కాలంలో నెల్లూరు సిటీలోని 15 ప్రాంతాలపై దాడులు నిర్వహించారు.. రికార్డులను పరిశీలించి, పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. చిన్నబజారు, మండపాల వీధి, పప్పుల వీధఇ ప్రాంతాల్లో 11 బృందాలు సోదాలు నిర్వహించాయి. పన్నులు చెల్లించకుండా చాలామంది వ్యాపారాలు చేస్తున్నట్టు గుర్తించారు. వారి రికార్డులు స్వాధీన చేసుకున్నారు.




ఐటీ దాడులంటూ కలకలం..


నెల్లూరులో సోమవారం సాయంత్రానికి బంగారు షాపుల వద్ద హడావిడి మొదలైంది. ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు చాలామంది వ్యాపారులు షాపులు మూసేసి వెళ్లిపోయారు. చివరకు అది డీఆర్ఐ అధికారుల సోదాలు అని తేలింది. స్థానిక పోలీసుల సహాయంతో డీఆర్ఐ సిబ్బంది బంగారు షాపుల్లో తనిఖీలు చేపట్టారు. కొంతమంది వ్యారాలు ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు అధికారులు.


పన్ను చెల్లించకుండా..


ఇటీవల బంగారం వర్తకంపై కేంద్రం సీరియస్ గా దృష్టిపెట్టింది. ప్రతి లావాదేవీ జీఎస్టీ పరిధిలోకి రావాలని సూచించింది. కానీ కొన్ని షాపుల్లో జీఎస్టీ లేకుండానే బిల్లు ఇస్తుంటారు. ఆమేరకు వినియోగదారులకు కూడా ఉపశమనం ఉంటుంది. దీన్నే జీరో వ్యాపారం అంటారు. ఇలాంటి వ్యాపారం నెల్లూరులో కూడా జోరుగా సాగుతుంది. పైకి బిల్లులు అన్నీ పక్కాగా ఉన్నట్టు కనిపించినా.. వినియోగదారులు అడిగితేనే బిల్లులు ఇస్తుంటారు. జీఎస్టీతో కలిపి ఇంత, లేకపోతే ఇంత తక్కువ అవుతుంది అని చెబుతుంటారు. దీంచో వినియోగదారులు కూడా జీఎస్టీలేని బిల్లులవైపు మొగ్గుచూపుతారు. దీంతో వ్యాపారులు ఆమేరకు పన్నులు తప్పించుకుంటారు.


చెన్నై బంగారంతో..


చెన్నై నుంచి బంగారు బిస్కెట్లను కూడా ఇలాగే బిల్లులు లేకుండా తెప్పించుకుంటారు వ్యాపారులు. వాస్తవానికి ఇలా వ్యాపారం చేయడం చట్టరీత్యా నేరం. పైకి అనుమతులు అన్నీ ఉన్నా కూడా లాభాలకోసం వ్యాపారులు ఇలా అడ్డదారి తొక్కుతుంటారు. తనిఖీలకు వచ్చినప్పుడు ఎంతోకొంత చేతిలో పెడితే పని పూర్తవుతుందనేది వీరి భావన. అయితే కొన్నిసార్లు మాత్రం ఇలా తనిఖీలలో పట్టుబడుతుంటారు. తాజాగా డీఆర్ఐ అధికారులు పక్కా సమాచారంతో నెల్లూరు షాపులపై దాడులు చేశారు. 40మంది అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.


దీపావళి సీజన్ కావడంతో బంగారు అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు ఒకేసారి దాడులు నిర్వహించారు. పక్కా ఆధారాలతో ఆయా షాపుల్ని టార్గెట్ చేశారు. రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. మరో రెండురోజులపాటు నెల్లూరులోని చిన్న చిన్న బంగారు షాపులు తీసే పరిస్థితి ఉండదు. ఈ లెక్కలన్నీ తేలిన తర్వాతే నెల్లూరులోని బంగారు షాపులకు మళ్లీ పండగ కళ వస్తుంది.