వివాహేతర సంబంధాలు చివరికి ఎంతటి అనర్థానికి దారి తీస్తాయో అందరికీ తెలిసిందే. తాజాగా అలాంటి మరో ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. కోడలు పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో మామకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోగా.. నిలదీసినందుకు ప్రియుడితో కలిసి ఆమె తన మామను చంపేసింది. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.


పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా వేముల పల్లి మండలం లక్ష్మీదేవి గూడెం గ్రామానికి చెందిన శ్యామల ముత్తయ్య అనే 60 ఏళ్ల వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. ముత్తయ్య బాతుల పెంచుతూ జీవనం సాగిస్తుంటాడు. బాతులను మేపేందుకు వారు కొద్ది రోజులు ఇంటి నుంచి దూరం వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే బాతులను మేపేందుకని శాలి గౌరారం మండలంలోని మాధారం కలాన్‌ గ్రామానికి ముత్తయ్య తన కుమారుడు నర్సింహ, కోడలు శైలజతో కలిసి వచ్చాడు. మాధారం కలాన్‌ గ్రామ సమీపంలోనే చెరువుకట్ట కింది భాగంలో తాత్కాలికంగా ఓ గుడిసె లేదా డేరా వేసుకుని అక్కడే నివాసం ఉంటున్నారు. 


ఈ క్రమంలో కరీంనగర్‌ పట్టణంలో నివాసం ఉంటున్న ముత్తయ్య పెద్ద కూతురు ఇంటి వద్ద ఓ శుభకార్యం ఉంది. ఆదివారం ముత్తయ్య మనుమరాలికి నూతన పట్టువస్త్రాలంకరణ ఉండడంతో ముత్తయ్య కొడుకు నర్సింహ ఇద్దరూ కలిసి శనివారం కరీంనగర్‌ వెళ్లిపోయారు. 


దూరపు బంధువుతో అక్రమ సంబంధం
కోడలు శైలజ ఒక్కరే ఆ గుడిసెలో ఉన్నారు. ఆమె గత కొంత కాలంగా తన అన్నకు వరుసకు బావమరిది అయిన బాతుల పెంపకందారుడైన మహేశ్‌తో కొంతకాలంగా సన్నిహితంగా ఉంటోంది. ప్రస్తుతం కేతేపల్లి మండలం కాసనగోడులో అతను బాతులను మేపుతున్నాడు. శైలజ భర్త, మామ కరీంనగర్‌కు వెళ్లిన విషయం తెలుసుకొన్న మహేశ్ శనివారం రాత్రి మాధారంకలాన్‌లోని శైలజ ఉంటున్న గుడిసె వద్దకు వచ్చాడు. శైలజ, మహేశ్‌లు ఒంటరిగా గుడిసెలో ఉండగా.. అదే సమయానికి తన మామ ముత్తయ్య అక్కడికి వచ్చాడు. గుడిసెలో ఇద్దర్నీ చూసి, కోపోద్రిక్తుడైన ముత్తయ్య.. కోడలు శైలజ, ప్రియుడు మహేశ్‌లను తిడుతూ ఈ విషయాన్ని స్థానికులకు చెబుతానని హెచ్చరించాడు.


విషయం బయటపడుతుందని గమనించిన కోడలు శైలజ, ప్రియుడు మహేశ్‌తో కలిసి ముత్తయ్యపై దాడికి దిగారు. ముత్తయ్యను కింద పడేసి ముఖంపై తలదిండు అదిమి పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ముత్తయ్య మృతి చెందాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి మహేశ్‌ పారిపోయాడు. కోడలు శైలజ తన పిల్లలతో కలిసి మామ మృతదేహాన్ని గుడిసెలోనే ఉంచి నిద్రపోయింది. ఆదివారం తెల్లవారుజామున కరీంనగర్‌లో ఉన్న తన భర్త నర్సింహకు ఫోన్‌ చేసి మామ ముత్తయ్య గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.


మాధారంకలాన్‌కు చేరుకున్న నర్సింహ.. తన తండ్రి శరీరాన్ని పరిశీలించగా.. ముఖంపై గాయాలు ఉన్నాయి. దీంతో భార్యపై అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ హత్యకు పాల్పడిన కోడలు శైలజ పోలీసుల అదుపులో ఉంది. పరారీలో ఉన్న మహేశ్‌ కోసం పోలీసులు వెతుకుతున్నారు.