Nalgonda Crime : నల్గొండలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని ఫారెస్ట్ పార్క్ లో మంగళవారం మధ్యాహ్నం ఓ యువతిపై కత్తితో దాడి చేశాడు యువకుడు. ప్రేమ పేరుతో వేధిస్తున్న ఓ యువకుడు కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...  రోహిత్ (21) అనే యువకుడు నల్గొండలోని ఎన్జీ కాలేజీలో బీబీఏ సెకండియర్ చదువుతున్నాడు. ఇతను గత ఏడు నెలల నుంచి నవ్య అనే అమ్మాయిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈరోజు నవ్య తన ఫ్రెండ్ శ్రేష్ఠతో  ఫారెస్ట్ పార్క్ లో సాయి అనే స్నేహితుడిని కలిసేందుకు వెళ్లింది. సాయితో పాటు నవ్యను సతాయిస్తున్న రోహిత్ కూడా అక్కడకు చేరుకున్నాడు. నవ్యతో రోహిత్ కొద్ది సేపు మాట్లాడాలి అంటూ నవ్యను పక్కకి తీసుకెళ్లాడు. అప్పటికే తన వెంట తెచ్చుకున్న కత్తితో నవ్యపై విచక్షణారహితంగా  కడుపు,  చేతులు, కాళ్లు, మొహంపై పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడే కొద్ది దూరంలో ఉన్న సాయి, శ్రేష్ఠ కలిసి నవ్యను ఆసుపత్రికి తరలించారు.  ప్రస్తుతం నవ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  


యువతి పరిస్థితి విషమం  


అయితే యువతిపై రోహిత్ పలుమార్లు దాడి చేసినట్లు తెలుస్తోంది. కానీ ఇవాళ కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఎనిమిది చోట్ల నవ్యకు గాయాలు అయ్యాయని వైద్యులు తెలిపారు. గాయాలు తీవ్రంగా అయ్యాయని వాటికి ఆపరేషన్ చేయాలని తెలిపారు. ప్రస్తుతానికి ప్రాణపాయం లేదన్నారు. గతంలో ఒకసారి నవ్యపై రోహిత్ దాడి చేశాడు. అప్పుడు సీసాతో నవ్యపై దాడి చేస్తే గాయమైంది. నవ్య సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేద్దామంటే తన చదువు డిస్టర్బ్ అవుతుందని యువతి పోలీసు ఫిర్యాదు అంగీకరించలేదు. అయితే రోహిత్ తల్లిదండ్రుల వద్దకు వెళ్లి నవ్య, ఆమె సోదరుడు రోహిత్ వేధింపులపై ఫిర్యాదు చేశారు. తమ కుమారుడు ఇకపై యువతి జోలికి రాడని రోహిత్ తల్లిదండ్రులు హామీ ఇచ్చారు. అయినా రోహిత్ వేధింపులు మాత్రం ఆగలేదు. చివరికి యువతిపై కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేశాడు. 


మహిళా సంఘాలు ఆగ్రహం 


ఈ ఘటనపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు రోహిత్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రేమ పేరుతో గత 5 నెలలుగా వేధిస్తున్నారన్నారు. తమ కుమార్తె ప్రాణాపాయ స్థితిలో ఉందని నవ్య తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమార్తెపై దాడి చేసిన యువకుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాయి. అయితే ఈ కేసుపై దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు. యువకుడి నుంచి సమాచారం రాబడుతున్నారు. యువకుడి మిత్రులను స్టేషన్ కు పిలిపించి దర్యాపు చేస్తున్నారు. అసలేం జరిగింది, ఇద్దరు ప్రేమించుకున్నారా? రోహిత్ ప్రేమించమని వేధించాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రేమ పేరుతో వేధింపులు కాదంటే దాడులు ఈ మధ్య ఎక్కువ అయిపోయాయని అంటున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటే మరొకరు దాడి చేయడానికి భయపడతారని అంటున్నారు. కానీ అలాంటి జరగపోవడం వల్లే దాడులు పునరావృతం అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


Also Read : Harsha Kumar Son Case : యువతితో అసభ్య ప్రవర్తన, మాజీ ఎంపీ హర్ష కుమార్ కుమారుడిపై కేసు నమోదు


Also Read : Bullet Bike Thieves: బుల్లెట్ బైకులంటే ప్రాణం, ఎక్కడ కనిపించినా అదే పనిచేస్తారు!