Case filed against TPCC Cheif Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ అసోసియేషన్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాలతో నాగర్ కర్నూల్ పీఎస్ లో రేవంత్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్ పై 153, 504, 506, 504 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. రేవంత్ వ్యాఖ్యలపై మొత్తం 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. 


మహబూబ్ నగర్ పోలీసులను గుడ్డలు ఊడతీసి కొడతా అంటూ రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. డైరీలో పోలీసుల పేర్లు రాసి పెడుతున్నాం అని.. 100 రోజుల తరువాత కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మీ గుడ్డలు ఊడతీసి కొడతాం, అసలు మిత్తి (వడ్డీ)తో సహా చెల్లిస్తాం అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలో జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు గుణవర్ధన్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రేవంత్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.