Mumbai Crime News: 25 ఏళ్లుగా తనతో సహజీవనం చేస్తున్న 54 ఏళ్ల మహిళపై 62  ఏళ్ల వయసున్న వ్యక్తి యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటనలో మహిళ తీవ్రంగా గాయపడింది. అయితే స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. అలాగే తీవ్రంగా గాయపడ్డ మహిళను స్థానిక ఆస్పత్రికి తరలించారు. 


అసలేం జరిగిందంటే..?


ముంబైకి చెందిన 62 ఏళ్ల మహేష్ పూజారి.. 54 ఏళ్ల వయసు ఉన్న ఓ మహిళతో గత పాతికేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఇద్దరూ కలిసి కల్బాదేవీ సమీపంలోని చాల్ లో నివాసం ఉంటున్నారు. గత కొంత కాలం నుంచి మహేష్ పూజారి తాగుడుకు బానిసయ్యాడు. తరచుగా మద్యం సేవించి వచ్చి.. తన ప్రియురాలితో గొడవ పడుతున్నాడు. అయితే గురువారం రోజు రాత్రి కూడా మహేష్ పూజారి ఫుల్లుగా తాగి వచ్చాడు. ఈ క్రమంలోనే మరోసారి వీళ్లిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. చాలా సేపటి తర్వాత ఇద్దరూ నిద్రించారు. ఉదయం లేవగానే మహిళ.. వాటర్ ట్యాంక్ నింపేందుకు ప్రయత్నించింది. బంగ్లాపైకి ఎక్కి ట్యాంక్ నిండిందో లేదో చెక్ చేస్తోంది. 


అప్పుడే మహేష్ పూజారి యాసిడ్ బాటిల్ తో పైకి వచ్చాడు. వెంటనే తన ప్రియురాలిపై యాసిడ్ పోశాడు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడు మహేష్ పూజారిని అరెస్ట్ చేశారు. అలాగే బాధిత మహిళను స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. తమకు విషయం తెలిసిన 15 నిమిషాల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సీనియర్ ఇన్ స్పెక్టర్ జ్యోతి దేశాయ్ తెలిపారు. ఇన్నేళ్లుగా తనతో కలిసి ఉండి.. తన బాగోగులు చూస్తున్న మహిళపై వృద్ధుడు యాసిడ్ దాడి చేయడాన్ని స్థానికులు నమ్మలేకపోతున్నారు. 


దేశంలో యాసిడ్ దాడి కేసులు..


నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వివరాల ఆధారంగా... 2021వ సంవత్సరలో దేశంలో మొత్తం 102 యాసిడ్ దాడి కేసులు నమోదు అయ్యాయి. అయితే 2019లో ఈ సంఖ్య 150 కాగా... 2020లో 105గా ఉంది. అయితే పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ లలోనే యాసిడ్ దాడి కేసులు ఎక్కువగా నమోదు అయినట్లు తెలుస్తోంది. దేశంలో ఏటా నమోదు అవుతున్న కేసుల్లో ఈ ప్రాంతాల నుంచే సగం కేసులు నమోదు అవ్వడం గమనార్హం. అలాగే 83 శాతం యాసిడ్ దాడి కేసుల్లో చార్జిషీట్లు ధాఖలు కాగా.. 54 శాతం కేసుల్లో దోషులుగా తేలింది. 2020లో చార్జీషీట్ రేటు 86 శాతానికి పెరగగా... నేరారోపణ రేటు 72 శాతానికి పెరిగింది. 2021లో ఈ రేట్లు అంటే చార్జీషీట్ 89 శాతం, నేరారోపణ కేసులు 20 శాతంగా నమోదు అయ్యాయి. 2015వ సంవత్సరంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు పంపిన సలహాలో యాసిడ్ దాడి కేసులను త్వరితగతిన విచారించాలని కోరింది. వీలయితే ఇలాంటి నేరాలు జరగకుండా చూస్కోవాలని పోలీసు అధికారులకు సూచించింది.