Matrimonial Fraud: ఆన్‌లైన్‌ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. భారీగా పెరుగుతున్న నేరాలు, మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దొంగతనాలు, దారి దోపిడీల స్థానంలో చిన్న క్లిక్, ఆన్‌లైన్‌ లో అబద్ధాలతో కష్టపడి సంపాదించిన సొమ్మును దోచుకుంటున్న ఘటనలు రోజూ వింటునే ఉన్నాం. మ్యాట్రిమోనీ సైట్లలో పరిచయం అయిన వ్యక్తులు మోసాలు చేస్తున్న కేసులూ వార్తల్లో వస్తూనే ఉన్నాయి. అయినా అలాంటి రీతిలోనే మోసాలు జరుగుతూనే ఉన్నాయి, మోసపోయే వాళ్లు మోసపోతూనే ఉన్నారు. అలాంటి ఓ మోసం తాజాగా మరొకటి వెలుగు చూసింది. అహ్మదాబాద్ కు చెందిన ఓ సాఫ్ట్‌పేర్‌ ఇంజినీర్ నుంచి ఏకంగా రూ. కోటి రూపాయలు మోసగించింది ఓ మహిళ.


గుజరాత్ గాంధీనగర్ లోని ఒక సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గత శనివారం రోజున సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. క్రిప్టో కరెన్సీ స్కామ్ లో తాను కోటి రూపాయలకు పైగా నష్టపోయాయని పోలీసులు వెల్లడించాడు. 


అహ్మదాబాద్ కు చెందిన కుల్దీప్ పటేల్ కు.. జూన్ లో మ్యాట్రిమోనియల్ సైట్ లో అదితి అనే మహిళ పరిచయం అయింది. తను యూకేలో ఉంటానని ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ బిజినెస్ చేస్తుంటానని చెప్పి నమ్మించింది. కొన్ని రోజుల పాటు వీరిద్దరి మధ్య ఫోన్ సంభాషణలు జరిగాయి. అలా వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. క్రిప్టో కరెన్సీ అయిన బానోకాయిన్ లో పెట్టుబడి పెడితే అత్యధిక లాభాలు వస్తాయని అదితి కుల్దీప్ పటేల్ ను క్రమంగా నమ్మించింది. అదితిపై ఉన్న నమ్మకంతో.. ఆమె చెప్పినట్లే చేశాడు కుల్దీప్. బానోకాయిన్ కస్టమర్ కేర్ ప్రతినిధితో మాట్లాడాడు. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ చెప్పినట్ల  ఓ వెబ్‌సైట్‌ లో రిజిస్టరయ్యాడు. మంచి రాబడి వస్తుందని, రావాలని డబ్బును పెట్టుబడిగా పెట్టడం ప్రారంభించాడు. మొదట లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టగా 78 అమెరికా డాలర్ల మేర లాభం వచ్చింది. అది కుల్దీప్ పటేల్ లో ఉత్సాహాన్ని నింపింది. తర్వాత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు. 18 లావాదేవీల్లో కోటి 34 లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టాడు. జూలై 20 నుంచి ఆగస్టు 31 మధ్య లావాదేవీలన్నీ నిర్వహించాడు. సెప్టెంబర్ 3వ తేదీన తన ఖాతా నుంచి రూ. 2.59 లక్షలు విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించగా.. అతడి క్రిప్టోకరెన్సీ ఖాతాను ఫ్రీజ్ చేసినట్లు తెలిసింది.


ఇదేంటి అని అడగడానికి బానోకాయిన్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ను సంప్రదించాడు. అతని అకౌంట్ ను డి-ఫ్రీజ్ చేయడానికి అదనంగా రూ.35 లక్షలు పెట్టుబడి పెట్టాలని వారు కుల్దీప్ కు సూచించారు. దీంతో కల్దీప్ అదితిని సంప్రదించడానికి ప్రయత్నించాడు. కానీ, అదితి స్పందించలేదు. ఎంతకీ డబ్బు రాకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు.


సోషల్ మీడియాను నమ్మొద్దు..


సోషల్ మీడియా వేదికగా సైబర్ నేరాగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో పరిచయం లేని వ్యక్తుల నుంచి ఓటిపి పంచుకోకూడదని, పరిచయం లేని వ్యక్తుల నుంచి వచ్చే వీడియో కాల్స్ స్పందించకూడదని పోలీసులు సూచిస్తున్నారు. అపరిచిత వ్యక్తులకు బ్యాంక్ అకౌంట్, ఆధార్, సీవీవీ నెంబర్, యూపీఐ, పాన్ కార్డు వివరాలను షేర్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయకుండా, గోప్యుంగా ఉంచుకోవాలని సూచించారు. ట్రేడింగ్ జాబ్ లాంటి వాటి నుంచి మోసాలు బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఆన్లైన్ గేమ్స్ కు దూరంగా ఉండాలని తెలియజేశారు