తనను ప్రేమించడం లేదని లేదా పెళ్లికి ఒప్పుకోలేదని యువతులపై కొంత మంది యాసిడ్ దాడికి పాల్పడిన ఘటనలు గతంలో ఎన్నో వెలుగు చూశాయి. అయితే, తాజాగా జరిగిన ఓ ఘటన వాటికి భిన్నం. ఎందుకంటే పెళ్లికి ఒప్పుకోలేదని ఓ మహిళ యువకుడిపై యాసిడ్ పోసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆమె వివాహిత. ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయిన ఆమె తన ప్రియుడు తనను పెళ్లి చేసుకోవడం లేదని ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది. ఈ విచిత్రమైన ఘటన కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగింది. 


తనను వివాహం చేసుకునేందుకు నిరాకరించిన యువకుడిపై వివాహిత యాసిడ్‌తో దాడి చేసింది. కేరళలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధిత యువకుడు తిరువనంతపురంలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. 28 ఏళ్ల అనిల్ కుమార్, ఇద్దరు పిల్లలకు తల్లి అయిన షీబా సోషల్ మీడియా ద్వారా స్నేహితులుగా మారారు.


వీరి స్నేహం క్రమంగా మరింత ముందుకు సాగింది. అతి మరీ మితిమీరడంతో ఆ తర్వాత కుమార్ ఆమెతో స్నేహానికి స్వస్తి చెప్పి మరో యువతిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఈ విషయం తెలిసిన షీబా.. కుమార్‌కు ఫోన్ చేసి మాట్లాడింది. పెళ్లి చేసుకుందామని అడిగింది. అందుకు అతడు నిరాకరించాడు. దీంతో కలుద్దామని ఓ చోటకు పిలిచి.. ఈ నెల 16న ఇరుంబుపాలెం వద్ద అతడిపై యాసిడ్‌తో దాడి చేసింది. కుమార్‌కు ముఖంపై యాసిడ్ పడడంతో అతనికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, అతడు చూపు కోల్పోయే ప్రమాదం ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనలో షాబాకు కూడా స్వల్పంగా గాయాలైనట్లుగా పోలీసులు వెల్లడించారు.


అయితే, ప్రియుడిపై యాసిడ్ పోస్తున్నప్పుడు ఓ చర్చి ఆవరణలోని సీసీటీవీ కెమెరాలో ఆ దృశ్యాలు అన్నీ రికార్డయ్యాయి. తాజాగా ఆ వీడియో వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు షీబాను అరెస్ట్ చేశారు.


Also Read: Nalgonda Mystery: గదిలో నుంచి పాడు వాసన.. తలుపులు తెరిచి చూసి ఇంటి ఓనర్ షాక్!


Also Read: Kurnool: కార్తీక దీపాలు వదిలేందుకు వెళ్లి భార్యాభర్తల మృతి... మరో ప్రమాదంలో నలుగురు మహిళలు గల్లంతు


Also Read: దాడి కేసులో స్పందించిన నటి.. షాకింగ్ విషయాలు, అసలు ఆ రోజు కేబీఆర్ పార్క్‌లో ఏం జరిగిందంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి