Mancherial News: సాధారణంగా పెళ్లి నచ్చక యువతులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు గతంలో అనేకం వెలుగుచూశాయి. కానీ, అదే వివాహం ఇష్టంలేక తాజాగా ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. మంచిర్యాల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్దలు కుదిర్చిన వివాహం నచ్చని ఓ పాతికేళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం రాపల్లె గ్రామానికి చెందిన కండె సతీశ్‌ అనే 25 ఏళ్ల వ్యక్తి మంచిర్యాల పట్టణంలోని ఓ పెట్రోల్‌ బంకులో పని చేస్తున్నాడు. 


ఈ క్రమంలో సమీప గ్రామానికి చెందిన ఓ యువతితో సతీశ్‌కు పెళ్లిని పెద్దలు నిశ్చయం చేశారు. అందులో భాగంగా ఈ నెల 11న పెళ్లి నిశ్చితార్థం  కూడా జరిగింది. ఈ నెల 25న పెళ్లి చేద్దామని ముహూర్తం కూడా ఖరారు చేశారు. అయితే, తొలుత పెళ్లి యువకుడు తనకు ఆ పెళ్లి ఇష్టం లేదని చెప్పేశాడు. అయినా పెద్దలు వినలేదు. దీంతో యువకుడు ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. 


పెట్రోల్‌ బంక్‌లో డ్యూటీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి ఈ నెల 12న సతీశ్ అనే యువకుడు బయటకు వచ్చాడు. శుక్రవారం జగిత్యాల కొత్త బస్టాండ్‌లోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకుని ఉన్నాడు. శనివారం ఉదయం పొద్దెక్కుతున్నా గది తలుపులు మాత్రం తీయడం లేదు. దీంతో హోటల్ సిబ్బంది కిటికీలో నుంచి చూడగా సతీశ్‌ ఫ్యాన్‌కు ఉరికి వేలాడుతున్నట్లుగా కనిపించాడు. దీనికి సంబంధించి నిర్వహకులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి వద్ద లభించిన ఆధారాలను బట్టి, అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి తండ్రి శంకరయ్య ఫిర్యాదు చేయడంతో నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కొడుకు పెళ్లి జరగనుందని, ఎంతో ఆశతో ఉన్న కుటుంబం ఇంట్లో ఈ ఘోరమైన ఘటన తీవ్రమైన విషాదాన్ని నింపింది.


విశాఖపట్నంలోనూ..
ఇలాంటి ఘటనే విశాఖపట్నంలోనూ నాలుగు రోజుల క్రితం చోటు చేసుకుంది. జిల్లాలోని మల్కాపురం పోలీసు స్టేషన్ పరిధిలోని జయేంద్ర కాలనీలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. దినేష్ అనే 28 ఏళ్ల యువకుడు విశాఖపట్నంలోని హెచ్‌పీసీఎల్‌లో కాంట్రాక్ట్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవలే తల్లిదండ్రులు ఓ యువతితో దినేష్‌కు పెళ్లి కుదిర్చారు. అయితే, దినేష్‌కు ఈ పెళ్లి ఇష్టం లేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పినా పెళ్లి చేసుకోవాలని బలవంతం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో పెళ్లి కొడుకును చేయడానికి ముందు రోజే దినేష్ ఇంట్లో నుంచి పారిపోయాడు. అయితే, యారాడ బీచ్ వద్ద ఉన్న ఆయనను బంధువులు వెతికి ఇంటికి తీసుకొచ్చారని స్థానికులు తెలిపారు.


అయితే, తెల్లవారితే పెళ్లి జరగాల్సి ఉండగా ఎలాగైనా పెళ్లి చేసేస్తారనుకున్న దినేష్ పొద్దున్నే ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం అందుకున్న మల్కాపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.