ఒక బీడీ ముక్క వల్ల తలెత్తిన ఘర్షణ ఒకరి ప్రాణం తీసింది. ఈ ఘటనలో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. బీడీ విషయంలో చాలా రోజుల క్రితం వీరు గొడవ పడగా.. ఆ పగతో తాజాగా నిందితుడు హత్య చేయడం గమనించదగ్గ విషయం. వీరిద్దరూ రౌడీ షీటర్లేనని పోలీసులు తెలిపారు. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు రౌడీషీటర్ల మధ్య బీడీ కోసం జరిగిన ఘర్షణ ఒకరి ప్రాణం తీసింది. రాజమహేంద్రవరం థర్డ్ టౌన్ పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానిక భాస్కర్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన జీరా వెంకట తోటయ్య రెడ్డి అనే 24 ఏళ్ల యువకుడు కొన్ని దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అదే ప్రాంతానికి చెందిన యర్రా సాయి కిరణ్‌ అనే వ్యక్తి ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. వీరు ఇద్దరు జైలులో రిమాండ్‌లో ఉన్న సమయంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది.


Also Read: Cyclone Gulab: ఉత్తరాంధ్రకు 'గులాబ్' తుపాను ముప్పు.. తెలంగాణలోనూ భారీ వర్షాలు 


ఒక బీడీ కోసం వారికి మాటామాటా పెరిగి అది ఘర్షణకు దారి తీసింది. తోటయ్య రెడ్డి జైల్లో సాయి కిరణ్‌పై దాడికి పాల్పడ్డాడు. కొద్ది కాలానికి ఇద్దరూ బెయిల్‌పై బయటికి వచ్చారు. బయట కూడా చాలా సార్లు ఇద్దరూ గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే శుక్రవారం మరోసారి ఇద్దరి మధ్య తగాదా జరిగింది. దీంతో అర్ధ రాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలోనూ తోటయ్య రెడ్ఢి కత్తితో నగరంలోని సుబ్బారావుపేట దానవాయిబాబు గుడి వద్ద ఉన్న సాయి కిరణ్‌ ఇంటికి వెళ్లాడు. తోటయ్య రెడ్డి తెచ్చిన కత్తితో అతడినే పొడిచి వంట కోసం వాడే ప్రెషర్ కుక్కరు మూత, కర్రతో దాడి చేసి తోటయ్య రెడ్డిని సాయి కిరణ్‌‌ చంపేశాడు. నిందితుడు సాయి కిరణ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లుగా పోలీసులు చెప్పారు. 


Also Read: Tollywood Vs Jagan : టాలీవుడ్‌పై ఏపీ ప్రభుత్వం పగ సాధిస్తోందా ? పవన్ కల్యాణ్ వ్యాఖ్యల వెనుక అసలు కారణం ఏమిటి ?


పెద్ద ఎత్తున గంజాయి పట్టివేత
మరోవైపు, రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తరలిస్తున్న ముఠాను చైతన్యపురి పోలీసులు అరెస్టు చేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మండల్‌ కొవడ గ్రామానికి చెందిన కుంచినిపల్లి వీరబాబు(28), విశాఖపట్నం జిల్లా మాకవానిపాలెం గ్రామానికి చెందిన రత్తుల శ్రీనివాస్‌రావు జల్సాలకు అలవాటు పడి విలాసంతమైన జీవితాన్ని గడిపేందుకు గంజాయి సరఫరా చేసే కిట్టు అలియాస్‌ శ్రీనివాస్‌ను కలిశారు.


తాము హైదరాబాద్‌లో ఎక్కువ ధరకు గంజాయిని సరఫరా చేస్తామంటూ.. ఒప్పందానికి వచ్చారు. ముగ్గురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. 22న కిట్టు సుమారు 23.140 కిలోల గంజాయిని రాజమండ్రి నుంచి హైదరాబాద్‌ తరలించాలని, అందుకు రూ.20 వేలు నుంచి రూ.30 వేలు ఇస్తానంటూ.. వీరబాబు, శ్రీనివాస్‌రావులకు చెప్పాడు. ఈ క్రమంలో రాజమండ్రికి వెళ్లిన ఇద్దరు అక్కడ గంజాయిని 9 ప్యాకెట్లలో నింపుకొని తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్‌కు చెందిన కారు డ్రైవర్‌ బొమ్మగల్ల సురేశ్‌‌ను సంప్రదించారు.


తమతో పాటు హైదరాబాద్‌కు గంజాయిని తరలించాలని కోరగా, అందుకు అంగీకరించిన సురేశ్‌.. ఎక్కువ డబ్బులు కావాలని డిమాండ్‌ చేశాడు. వారి మధ్య ఒప్పందం జరిగిన అనంతరం వాహనంలో గంజాయిని తీసుకుని నగరానికి వచ్చారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న చైతన్యపురి పోలీసులు కొత్తపేట బీజేఆర్‌ భవన్‌ సమీపంలోని టెలీఫోన్‌ కాలనీ వద్ద వాహనాన్ని ఆపి తనిఖీలు చేసి.. గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.


Also Read: Gold-Silver Price: స్థిరంగా పసిడి ధర.. వెండి మాత్రం దిగువకు.. నేటి తాజా ధరలివే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి