Loan App Racket: లోన్ యాప్ నిర్వాహకులు సరికొత్త పంథాలో నేరాలకు పాల్పడుతున్నారు. డబ్బు కోసం అడ్డదారులు తొక్కుతూ... అమాయకపు ప్రజలను వేధింపులకు గురి చేస్తున్నారు. గతంలో లోన్ తీసుకున్న వాళ్లనే టార్గెట్ చేసే దళారులు, ఇప్పుడు డబ్బున్న వాళ్లను మాత్రమే టార్గెట్ చేస్తూ దోచేస్తున్నారు. విపరీతంగా వేధిస్తూ.. డబ్బులు గుంజుతున్నారు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన ఓ వ్యాపారిని లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురి చేస్తున్నారు. అతడి మొబైల్ ఫోన్ హ్యాక్ చేసి డబ్బులు వసూలు చేసేందుకు బరితెగించారు. అతని సన్నిహితులు, బంధువులకు అభ్యంతరకర మెసేజ్ లు, ఫోన్ కాల్స్ చేసి డబ్బుల కోసం టార్చర్ చేస్తున్నారు. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వారం క్రితం ఓ లోన్ యాప్ ద్వారా 1700 లోన్ తీసుకున్నట్లు ఏడు రోజుల కాల పరిమితి ముగిసినప్పటికీ డబ్బులు చెల్లించడంలేదంటూ అభ్యంతకరమైన మెసేజ్ లతో రవి కుమార్ ను వేధించడం మొదలు పెట్టారు. అంతటితో ఆగకుండా అసలు 1700 వడ్డీ 1300 అసలు కలిపి మొత్తం 3 వేలు చెల్లించాలని పోన్ చేసి వేధిస్తున్నారు. రవి కుమార్ ను చోర్, సెక్స్ వర్కర్ గా చిత్రీకరిస్తూ అతని కాంటాక్ట్ లిస్టులో ఉన్న వారికి వాట్సాప్ మెసేజ్, ప్రైవేట్ నెంబర్లతో ఫోన్లు చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తను తీసుకొని డబ్బులు చెల్లించలేదంటూ చేస్తున్న ప్రచారానికి రవి కుమార్ కంగుతిన్నాడు. లోన్ యాప్ నిర్వాహకులు చేస్తున్న టార్చర్ కు మానసిక వేదనకు గురయ్యాడు. 


సన్నిహితుల సలహాతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు పోలీసులను సంప్రదించాలని చెబుతున్నారు.  


లోన్ యాప్ బెదిరింపులతో ఇటీవలే యువకుడి ఆత్మహత్య..


లోన్ ఆప్ బెదిరింపులు ఎంసెట్ ర్యాంకర్ ప్రాణాలు తీశాయి. ఎంతో మంచి భవిష్యత్ ఉన్న విద్యార్థిని సైతం లోన్ యాప్ వేధింపులు వదిలిపెట్టలేదు. భయాందోళనతో ఎంసెట్ ర్యాంకర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువకుడు కష్టపడి చదివి ఎంసెట్లో రెండు వేల ర్యాంకు సాధించాడు. అయితే రుణ యాప్ వల కు చిక్కి చివరికి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ లో జరిగింది. కరీంనగర్ కి చెందిన ముని సాయి అనే యువకుడ్ని లోన్ యాప్ బెదిరింపులు ఆత్మహత్య చేసుకునేలా చేశాయి.


కరీంనగర్ సమీపంలోని నగునూరుకు చెందిన శ్రీధర్ - పద్మ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ పిల్లల్ని చదివిస్తున్నారు. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ముని సాయి(19) ఉన్నారు. ఇటీవల జరిగిన ఎంసెట్ 2022 పరీక్షల్లో ముని సాయికి 2000 ర్యాంకు వచ్చింది. ఎంతో సంతోషంలో మునిగిపోయిన ఆ కుటుంబం ముని సాయి ఉన్నత చదువుల కోసం ప్లాన్ చేశారు. ముందుగా కౌన్సిలింగ్ కి హాజరు కావడానికి హైదరాబాద్ కి వచ్చి శంషాబాద్ లోని తన స్నేహితుడి గదిలో ఉంటున్నాడు. పట్టణంలోని వివిధ కాలేజీలకు సంబంధించి వివరాలు సేకరిస్తూ భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటున్నాడు. కౌన్సిలింగ్ కాగానే పూర్తిగా హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యే ఆలోచన చేశాడు. 


నాలుగు నెలల కిందట ఎలా ట్రాప్ లో పడ్డాడో ఏమో గాని లోన్ ఆప్ (Loan App)లకు సంబంధించి మెసేజ్ రావడంతో వాటి నుండి లోన్ కోసం అప్లై చేశాడు. కేవలం పదివేల రూపాయల లోన్ ఎం-పాకెట్, ధని యాప్ ల ద్వారా తీసుకున్నాడు. అయితే E యాప్ నిర్వాహకులు కాల్ సెంటర్ నుండి వరుసగా ఫోన్ చేస్తూ బెదిరించడంతో ఇప్పటికీ దాదాపు 45 వేల రూపాయల వరకు తిరిగి చెల్లించాడు ముని సాయి. అంతటితో ఆగని యాప్స్ సిబ్బంది మరో 15000 రూపాయలు కట్టాలంటూ పరుషమైన పదజాలంతో ముని సాయిని బెదిరించారు. అంతేకాకుండా తనకు సంబంధించిన వివరాలు అన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్లకు సైతం తను చీటర్ అంటూ ఫొటోలు పెడతామని బెదిరించసాగారు. 


నిజంగానే పరిస్థితి అంతవరకు వెళుతుందని భయపడ్డ ఎంసెట్ ర్యాంకర్ ముని సాయి ఈనెల 20వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన స్థానికులు అతడ్ని వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్న ముని సాయి శుక్రవారం రోజు మృతి చెందాడు. ఒకవైపు దాదాపుగా 50,000 కట్టిన మరోవైపు ముని సాయి ట్రీట్మెంట్ కోసం మూడు లక్షలు ఖర్చు చేశారు. లోన్ యాప్ వేధింపుల కారణంగా ఓవైపు లక్షల డబ్బుు ఖర్చు చేసినా, అన్నదాత కుమారుడి జీవితం అర్దంతరంగా ముగిసినట్లయింది.