Lady Doctor Forceful Death In Nellore: నెల్లూరు (Nellore) జిల్లాలో సోమవారం తీవ్ర విషాదం జరిగింది. ఓ వైద్యురాలు వైద్య కళాశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేజర్ల మండలం చిత్తలూరు పీహెచ్సీలో విధులు నిర్వహిస్తోన్న వైద్యురాలు జ్యోతి నెల్లూరు వైద్య కళాశాలలో శిక్షణకు హాజరయ్యారు. క్యాన్సర్‌ స్క్రీనింగ్‌పై ట్రైనింగ్‌కు హాజరైన ఆమె హఠాత్తుగా భవనం పైనుంచి దూకారు. తీవ్ర గాయాలైన ఆమెను అక్కడే ఉన్న సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి భర్త రవిబాబు కూడా వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడ్డారా.? లేదా ప్రమాదవశాత్తు కింద పడ్డారా.? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


తెలంగాణలోనూ..


అటు, హైదరాబాద్ నాంపల్లిలోని ఓ బ్యాంకు ఉద్యోగి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ మూడో అంతస్తులో.. సైదాబాద్‌కు చెందిన ఓంకార్ అనే ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఛైర్మన్ బాత్ రూంలో కిటికీకి ఉరి వేసుకుని మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: AP News: నది దాటుతూ ఏపీకి చెందిన ముగ్గురు సైనికుల మరణం, విజయవాడకు మృతదేహాలు