Secretariat Lady Employee Suspicious Death: నంద్యాల (Nandyal) జిల్లా నూనెపల్లెలో విషాదం నెలకొంది. ఓ సచివాలయ ఉద్యోగిని అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. నంద్యాల 29వ వార్డు సచివాలయంలో విధులు నిర్వహిస్తోన్న ఉద్యోగిని సుధారాణి ఇంట్లోని బాత్ రూంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ పింఛన్ల పంపిణీలో ఆమె పాల్గొన్నారు. అనంతరం మధ్యలో ఇంటికి వెళ్లి ఎంతసేపటికీ రాకపోవడంతో తోటి ఉద్యోగులు ఫోన్ చేశారు. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆమె భర్త, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు విచారించారు. మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా ఆమె పుట్టింట్లో ఉన్నట్లు తెలుసుకుని వెళ్లి చూడగా.. బాత్రూంలో విగతజీవిగా పడి ఉన్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. భర్త, మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నంద్యాల మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుధారాణికి ఏడాది క్రితమే వివాహం జరిగినట్లు తెలుస్తోంది.


నెల్లూరులో వైద్యురాలు


అటు, నెల్లూరు జిల్లాలోనూ ఓ వైద్యురాలు సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. చేజర్ల మండలం చిత్తలూరు పీహెచ్సీలో విధులు నిర్వహిస్తోన్న వైద్యురాలు జ్యోతి నెల్లూరు వైద్య కళాశాలలో శిక్షణకు హాజరయ్యారు. క్యాన్సర్‌ స్క్రీనింగ్‌పై ట్రైనింగ్‌కు హాజరైన ఆమె హఠాత్తుగా భవనం పైనుంచి దూకారు. తీవ్ర గాయాలైన ఆమెను అక్కడే ఉన్న సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి భర్త రవిబాబు కూడా వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడ్డారా.? లేక మరేదైనా కారణమా.? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.


Also Read: Road Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు