Acid Attack: కృష్ణా జిల్లా పెడన మండలంలో దారుణం చోటుచేసుకుంది. 20వ వార్డులోని రామలక్ష్మీ కాలనీకి చెందిన ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ తో దాడి చేశారు. ఈ ఘటనలో మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమె ముఖం, ఒంటిపై తీవ్ర కాలిన గాయాలయ్యాయి. అయితే బాధిత మహిళ కేకలు వేయడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు పరుగున ఆమె వద్దకు వచ్చారు. ఆలోపే నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులను మహిళను మచిలీపట్నం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ దాడిలో గాయపడ్డ మహిళ పేరు మోకా కరుణ కుమారిని అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను అడిగి పలు వివరాలు సేకరించారు. కరుణ కుమారికి ఎవరితోనైనా గొడవలు, పగలు ఉన్నాయేమో కనుక్కుంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


నెల్లూరులో బాలికపై యాసిడ్ దాడి..


నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల పరిధిలోని చెముడుగుంట నక్కల కాలనీలో ఓ బాలికపై గత ఏడాది యాసిడ్ దాడి జరిగింది. అయితే బాలిక తండ్రికి చెల్లెలు కుమారుడు నెల్లూరు నాగరాజు. వరుసకు బాలికకు బావ అవుతాడు. అతని వయసు 34 ఏళ్లు. నాగరాజు ఆటో నడుపుకుని జీవనం సాగించేవాడు, బాలిక ఇంటికి సమీపంలోనే ఇతని కుటుంబం కూడా నివాసం ఉండేది. సెప్టెంబర్ 5వతేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు నిందితుడు నాగరాజు బాలిక నివాసానికి వెళ్లాడు. అంతకు ముందే అతను ఆ ఇంటికి వెళ్లి కూర కావాలని అడిగి గిన్నెలో తెచ్చుకున్నాడు. ఆ సమయంలో ఆ బాలిక ఒంటరిగా ఉండటాన్ని గుర్తించాడు నాగరాజు. ఆ గిన్నె తిరిగిచ్చే నెపంతో మరోసారి ఇంటికి వెళ్లాడు. కానీ ఈసారి గిన్నెలో యాసిడ్ తీసుకుని వెళ్లాడు. ఆమెను బెదరించి ఒంటిపై బంగారం, ఇంట్లోని నగదు తీసుకుని వెళ్లాలని ప్లాన్ వేశాడు. 


నాగరాజు బెదిరింపులకు భయపడిన బాలిక తన చెవి కమ్మ తీసి ఇచ్చేసింది. మరో కమ్మ రాకపోవడంతో ఆమె ప్రయత్నించేలోగా నాగరాజు తనతో తెచ్చుకున్న యాసిడ్ లో గుడ్డను ముంచి ఆమె మొహంపై పెట్టాడు. దీంతో ఆమెకు కాలిన గాయాలయ్యాయి. అక్కడితో ఆగకుండా చాకు తీసుకొచ్చి ఆమె గొంతు కోయడానికి ప్రయత్నించాడు. బాలిక మెడకు గాయమైంది. దానికంటే ఎక్కువగా యాసిడ్ పోయడంవల్ల ఆమె ఎక్కువగా ఇబ్బంది పడింది. ఆ తర్వాత నిందితుడు పారిపోయాడు. కొంతసేపటికి స్పృహలోకి వచ్చిన ఆ బాలిక పొరుగింటివారి వద్దకు వెళ్లి విషయం చెప్పింది. వారు తండ్రికి ఫోన్ చేసి సమాచారమిచ్చారు. వెంటనే పోలీసులకు సమాచారం రావడంతో.. వారు ఆ బాలికను నెల్లూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అపోలో ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆమెను చెన్నైకి తరలించారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై కఠినమైన సెక్షన్లు పెట్టామన్నారు. ఐపీసీ 326, 380, 448, 307, 386, 342, 354, 509తోపాటు రాబరీ కేసు, ఫోక్సో యాక్ట్ కింద కూడా కేసులు పెట్టామని పోలీసులు చెప్పారు.