Bantumilli News : కృష్ణాజిల్లా బంటుమిల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. నూతిలోని మట్టి తీసేందుకు దిగిన నలుగురు వ్యక్తులు ఊపిరాడక చనిపోయారు. వీరిలో ఇద్దరు బంటుమిల్లి బీఎన్ఆర్ కాలనీకి చెందిన తండ్రి కొడుకులు, మరొకరు ములపర్రు గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. మరొకరు ఇంటి యజమానిగా తెలుస్తోంది. వీరంతా నూతిలో మట్టి పూడిక తీసేందుకు వెళ్లి ఊబిలో కూరుకుపోయి మృతి చెందినట్లు స్థానికులు చెప్తున్నారు.  మృతులు రంగా, శ్రీనివాసరావు, రామారావు , లక్ష్మణరావుగా గుర్తించారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


లఖ్ నవూలో ఘోర ప్రమాదం 


 ఉత్తర్‌ప్రదేశ్‌ లఖ్‌నవూలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా లఖ్‌నవూలోని దిల్‌కుషా ప్రాంతంలో ఆర్మీ ఎన్‌క్లేవ్ సరిహద్దు గోడ కూలిపోయింది. ఈ ఘటనలో 9 మంది వరకు మృతి చెందారు. శిథిలాల నుంచి ఓ వ్యక్తిని కాపాడినట్లు పోలీసులు తెలిపారు.  


" కొంతమంది కార్మికులు దిల్‌కుషా ప్రాంతంలోని ఆర్మీ ఎన్‌క్లేవ్ వెలుపల గుడిసెలలో నివసిస్తున్నారు. రాత్రిపూట భారీ వర్షాల కారణంగా ఆ ప్రహారీ గోడ కూలిపోయింది. సమాచారం అందిన వెంటనే మేం తెల్లవారుజామున 3 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకున్నాం. శిథిలాల నుంచి 9 మృతదేహాలను వెలికి తీశాం. ఓ వ్యక్తిని సురక్షితంగా కాపాడగలిగాం. " -పీయూష్ మోర్డియా, జాయింట్ పోలీస్ కమిషనర్, లా అండ్ ఆర్డర్


గోడ కూలిన ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.2లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. ఇక ఉన్నావ్‌ జిల్లాలో కురిసిన వర్షాలకు ఓ ఇంటి పైకప్పు కూలింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మరణించారు.


" లఖ్‌నవూలో శుక్రవారం తెల్లవారుజామున ఆర్మీ ఎన్‌క్లేవ్ ప్రహారీ గోడ కూలిపోయిన ఘటనలో మృతి చెందిన వారు సాధారణ కార్మికులు. ఆ సమయంలో వారు నిద్రిస్తున్నారు. గోడ కూలిపోవడానికి గల కారణాలను పరిశీలిస్తున్నాం.  " -బ్రజేష్ పాఠక్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి