RG Kar Medical College: కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ హాస్పిటల్‌లో జరిగిన హత్యాచార ఉదంతం దేశమంతటినీ ఒక్కసారిగా కుదిపేసింది. ఆగ్రహంతో కొంత మంది నిరసనకారులు హాస్పిటల్‌పై దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ తరహా దారుణాలు జరగం ఇక్కడ ఇదే తొలిసారి కాదు. చెప్పాలంటే ఈ హాస్పిటల్‌కి చీకటి చరిత్ర ఉంది. గత 23 ఏళ్లలో ఎంతో మంది ఇదే హాస్పిటల్‌లో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. అంతే కాదు. అశ్లీల వీడియోలకు సంబంధించిన కేసులూ నమోదయ్యాయి. ఇప్పటికీ ఆ కేసులు పెద్ద మిస్టరీగానే ఉండిపోయాయి. ఆగస్టు 9వ తేదీన నమోదైన ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన కూడా ఇంతే. ఈ కేసు చుట్టూ ఎన్నో చిక్కుముడులున్నాయి. మరెన్నో అనుమానాలున్నాయి. విచారణ జరుగుతున్నా ఇప్పటికీ ఏదీ ఓ కొలిక్కి రాలేదు. ఫలితంగా ఈ హాస్పిటల్ చరిత్రపై మరోసారి చర్చ మొదలైంది. ఈ ఆసుపత్రిలో "ఏదో జరుగుతోంది" అన్న సందేహాలకు ఈ ఘటనలన్నీ బలం చేకూరుస్తున్నాయి. 


వీడని మిస్టరీలు..


2001లో కూడా ఇలానే ఓ మెడికల్ స్టూడెంట్‌ సౌమిత్ర బిశ్వాస్ ఇదే హాస్పిటల్‌లో ప్రాణాలు కోల్పోయాడు. అక్కడ పోర్నోగ్రఫీ గ్యాంగ్‌ ఉందని గుర్తించాడని, అందుకే అతడిని దారుణంగా చంపేశారన్న వాదనలున్నాయి. అప్పుడు కూడా ఇది ఆత్మహత్యే అని చిత్రించారు. తల్లిదండ్రులు పోరాటం చేయడం వల్ల CID విచారణ జరిపించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఓ విద్యార్థిని అరెస్ట్ చేశారు. అయితే...ఆ తరవాత ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. అలా అసంపూర్తిగా ఉండిపోయింది. హాస్టల్ రూమ్‌లో ఫ్యాన్‌కి ఉరి వేసుకుని చనిపోయినట్టుగా చిత్రించారని, కానీ ఇక్కడి రహస్యాల్ని బయటకు చెబుతాడన్న భయంతో చంపేసి ఇలా సూసైడ్‌లా నమ్మించారని అప్పట్లో వాదనలు వినిపించాయి. ఆ తరవాత 2003లో అక్కడి సిబ్బందిలో ఒకరు అనుమానాస్పద రీతిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. బిల్డింగ్ పై నుంచి కిందకు దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఈ కేసు కూడా మిస్టరీయే. ఇదే 2003లో ఓ ఇంటర్న్ ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది రోజులుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని, అందుకే చనిపోయి ఉంటాడని అప్పట్లో పోలీసులు చెప్పారు. అంతకు మించి ఈ కేసులో విచారణ జరిగింది లేదు. యాంటీ డిప్రెషన్ పిల్స్ ఓవర్ డోస్ కారణంగానే చనిపోయాడని తేల్చి చెప్పారు. 


2016లో మరో దారుణం వెలుగు చూసింది. 54 ఏళ్ల ప్రొఫెసర్ గౌతమ్ పాల్ తన అపార్ట్‌మెంట్‌లోనే అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఆయన ముఖంపై గాయాలున్నట్టు పోలీసులు గుర్తించారు. గుండెపోటుతో చనిపోయాడని కేసు క్లోజ్ చేశారు. 2020లో పౌలోమి సహా అనే ఫిమేల్ ట్రైనీ డాక్టర్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. డిప్రెషన్‌తో సూసైడ్ చేసుకున్నట్టు చెప్పారు. ఈ ఘటనలోనూ ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదు. ఇప్పుడు అభయ కేసులోనూ ఇదే మిస్టరీ కొనసాగుతోంది. సీబీఐ విచారణ చేపడుతున్నా ఇప్పటికీ ఎలాంటి చిక్కుముడులు వీడలేదు. 


Also Read: Kolkata: హాస్పిటల్ నాకు రెండో ఇల్లు, ఈ సారి అమ్మవారి పూజ ఇంకా గొప్పగా చేసుకోవాలి - ట్రైనీ డాక్టర్‌ చివరి మాటలివే!