Amritpal Singh Wife Arrest: 


లండన్‌కు పరారీ..?


ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ భార్య కిరణ్‌దీప్ కౌర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. లండన్‌కు పారిపోవాలని ప్లాన్ చేసిన ఆమెను శ్రీ గురు రామ్ దాస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఆమెను అడ్డగించారు. ఇవాళ మధ్యాహ్నం ఆమె లండన్‌కు వెళ్లాల్సి ఉంది. ఫ్లైట్‌ ఎక్కేందుకు అమృత్‌సర్‌కి వచ్చిన ఆమెపై నిఘా పెట్టారు పోలీసులు. కొద్ది నెలల క్రితమే అమృత్ పాల్...కిరణ్‌దీప్ కౌర్‌ను పెళ్లి చేసుకున్నాడు. పంజాబ్‌లోని జల్లుపూర్ ఖేడాలో కాపురం పెట్టారు. అప్పటి నుంచి అమృత్ పాల్‌ సింగ్‌ ఉద్యమం ఉద్ధృతమైంది. ప్రత్యేక ఖలిస్థాన్ దేశం కోసం నానా రచ్చ సృష్టించాడు. వారిస్ పంజాబ్ దే పేరిట ఓ పార్టీ పెట్టి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాడు. కిరణ్‌దీప్ కౌర్ ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్నారని ముందస్తు సమాచారం పోలీసులకు అందింది. ఈ మేరకు ముందే అక్కడ నిఘా పెట్టారు. ఆమె ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఖలిస్థాన్ మద్దతుదారులకు కిరణ్‌దీప్ కౌర్ భారీ మొత్తంలో ఫండ్స్ అందిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అయితే...ఆమె అరెస్ట్‌పై పంజాబ్ పోలీసులు క్లారిటీ ఇవ్వడం లేదు. కేవలం ఆమెను ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. ఇమిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులు కూడా ఆమెను ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.