Students : కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలపై నుంచి దూకి 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. కరీంనగర్  కేంద్రానికి చెందిన విద్యార్థిని తల్లిదండ్రులు రాలేదని మనస్థాపంతో భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిస్తోంది. విద్యార్థినిని హుటాహుటిన పోలీస్ వాహనంలో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.  


స్కూల్లో సమస్యలు చూసి తట్టుకోలేక విద్యార్థి మృతి 


 డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడి బాలుర గురుకుల పాఠశాలలో సమస్యలను చూసి తట్టుకోలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపించారు. గురుకుల పాఠశాలలో దుర్భరమైన పరిస్థితుల వల్లే తట్టుకోలేక అతి చిన్న వయసులో అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు.  సోహిత్ రాజవర్ధన్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ, ప్రజా, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. గోడి గురుకుల పాఠశాల వద్ద విద్యార్థి ఆత్మహత్యపై విద్యార్థి సంఘ నాయకులు, తల్లిదండ్రులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి తండ్రి శ్రీహరి మాట్లాడుతూ తన కుమారుడు రాజవర్ధన్ గురుకుల పాఠశాలలో ఉండగానే అనారోగ్యానికి గురవడంతో  ఇంటికి తీసుకువెళ్లానని గురుకుల పాఠశాలలో కనీసం తాగడానికి మంచినీళ్లు, నాణ్యమైన ఆహారం లేకపోవడం పారిశుద్ధ్యం లోపించడంతో విద్యార్థులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. ఈ సందర్భంలో ఇంటికి తీసుకువెళ్లిన తన కుమారుడు తనను మళ్లీ గురుకుల పాఠశాలకు తీసుకువెళతానని చెప్పడంతో అక్కడ నెలకొని ఉన్న సమస్యలు వల్ల తలెత్తుతున్న ఇబ్బందులను తట్టుకోలేనని భయంతో ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. 


 జ్వరంతో ఆసుపత్రికి వచ్చిన విద్యార్థిని, ఇంజెక్షన్ ఇచ్చిన క్షణాల్లోనే 


జ్వరంతో వైద్యం కోసం వచ్చిన బాలిక మృతి  చెందటంతో గుంటూరులో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. చందోలు గ్రామానికి చెందిన ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని జ్వరంతో బాధపడుతుంటే  ట్రీట్మెంట్ కోసం పొన్నూరులోని ఫతిమా హాస్పటల్ కు తీసుకువచ్చారు కుటుంబసభ్యులు.  హాస్పిటల్ సిబ్బంది ఇంజెక్షన్ ఇచ్చిన నిమిషాల‌ వ్యవధిలో బాలిక శరీరం రంగు మారి మృతి చెందింది. ఈ ఘటనతో బాలిక బంధువులు, స్థానికులు ఆగ్రహం చెందారు. హాస్పటల్ ఫర్నీచర్, అద్దాలను ధ్వంసం చేశారు. ఈ సంఘటన సమచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్ వద్దకు‌ వచ్చినా బంధువులను కంట్రోల్ చేయలేకపోయారు.  పోలీసుల ముందే విద్యార్థిని బంధువులు విధ్వంసం కొనసాగించారు. నడుచుకుంటూ వచ్చిన తమ కుమార్తె ఇంజెక్షన్  చేసిన వెంటనే చనిపోవడాన్ని కుటుంబ‌ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు. పోలీసులును బేఖాతరు చేస్తూ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.


ప్రియురాలు మోసం చేసిందని సెల్ఫీ సూసైడ్ 


క్షణికావేశంలో యువత ప్రాణాలు కోల్పోతోంది. తాము ఏం చేస్తున్నాం, ఇది కరెక్టా కాదా అని, తల్లిదండ్రుల ఆవేదన గురించి ఆలోచించకుండా బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఉద్యోగం రాలేదని కొందరు చనిపోతుంటే, ప్రేమించిన వారు మోసం చేశారని కొందరు లవర్స్ ఆత్మహత్య చేసుకుంటున్నారు. మొబైల్ కొనివ్వలేదని, బైక్ కొనివ్వలేదంటూ సైతం ఇటీవల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బుద్వేల్ లో జరిగింది. ప్రేమించిన అమ్మాయి తనను మోసం చేసిందని, ఆ మోసాన్ని తట్టుకోలేక యువకుడు బలవన్మరణం చెందాడు.


అసలేం జరిగిందంటే..


వికారాబాద్ జిల్లా, చౌడపూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు చిన్నప్పుడే  తల్లిదండ్రులను కోల్పోయాడు. కొంతకాలం నుంచి ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. వీరిద్దరూ కొంతకాలం కలిసి షికార్లు చేశారు. ప్రేమలో ముగినితేలుతున్నా కెరీర్ మీద ఫోకస్ తప్పలేదు ప్రవీణ్. కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాడు. ఈవెంట్స్ సైతం పూర్తి చేసుకుని, మెయిన్స్ కు ప్రిపేర్ అవుతున్నట్లు సమాచారం. కానీ ఈ క్రమంలో ప్రేమించిన యువతి ప్రవీణ్ ను మోసం చేసింది. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తనను కాదని మోసం చేసి వేరే అబ్బాయి సన్నిహితంగా ఉంటూ అతడితో వివాహానికి సిద్దమైంది. ఈ విషయాన్ని ప్రియుడు జీర్ణించుకోలేకపోయాడు. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తనను మోసం చేసిందని తీవ్ర మనస్తాపానికి గురై పెద్ద నిర్ణయం తీసుకున్నాడు ప్రవీణ్. ఇక జీవితం వద్దనుకుని చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు ప్రవీణ్. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడి ఆత్మహత్య చేసుకున్న చోట సూసైడ్ నోట్ తో పాటు తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు గుర్తించారు.