Kamareddy News : కామారెడ్డి జిల్లా తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కామారెడ్డిలో బీడీ వర్కర్స్ కాలనీలో ప్రమాదం జరిగింది. విద్యుత్ షాక్ తో హైమద్, పర్వీన్, మోహిన్, అద్నాన్ నలుగురు మృతి చెందారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందినవారుగా తెలుస్తోంది. జిల్లాలో గత నాలుగు రోజులు ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో బాధితుల ఇల్లు మొత్తం తేమతో నిండిపోయింది. దీంతో ఇంట్లో విద్యుత్ సరఫరా అయింది. ఈ విషయాన్ని గుర్తించని కుటుంబ సభ్యులు వస్తువులను తాకడంతో అందరికీ కరెంట్‌ షాక్‌ కొట్టింది. ఈ ప్రమాదంలో భార్యభర్తలతో పాటు ఇద్దరు పిల్లలు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు హైమద్‌(35), పర్వీన్‌(30), అద్నాన్‌ (4), మాహిమ్‌ (6)గా పోలీసులు నిర్ధరించారు. ఈ ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి విద్యుత్ షాక్‌ కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి. 


అసలేం జరిగింది?  


కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీడీ వర్కర్స్ కాలనిలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. ఇంట్లో విద్యుత్ వైర్ తగిలి తల్లిదండ్రులకు షాక్ కొట్టింది. అనంతరం తెగిన వైర్ పిల్లలపై పడి నలుగురు విద్యుత్ షాక్ కు గురయ్యారు. మృతులు రేకుల షెడ్డులో నివాసం ఉంటున్నారు. బట్టలు ఆరేసుకునేందుకు ఇనుప తీగను కట్టారు. 3 రోజులుగా వర్షం కురవడంతో ఇనుప తీగ విద్యుత్ మీటర్ కు తగిలి ఒక్కసారిగా కరెంట్ పాస్ అయ్యింది. మొదట తల్లి పర్వీన్ బట్టలు ఆరేసేందుకు వెల్లింది. కరెంట్ షాక్ తగలడంతో గట్టిగా అరిచింది ఆ తర్వాత ఆమె భర్త పర్వీన్ వద్దకు వెళ్లాడు. అతనికి కూడా కరెంట్ షాక్ తగిలింది. పిల్లలు ఇద్దరు తల్లిదండ్రుల వద్దకు వెళ్లటంతో ఒక్కసారిగా నలుగురు విద్యుదాఘాతానికి గురయ్యారు. 


అప్రమత్తంగా ఉండండి


ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో కాలనీ వాసులు కన్నీరు మున్నీరయ్యారు. కుటుంబం ఒక్కసారిగా చనిపోవటంతో స్థానికులు జీర్ణించుకోలేక పోతున్నారు. స్థానికులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఇంటికి విద్యుత్ ప్రవాహం నిలిపివేసి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలకు కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.  వర్షాల బాగా కురుస్తుండటం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ అధికారులు సూచిస్తున్నారు. విద్యుత్ వైర్లతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.