కాకినాడ జిల్లాలో మరో ఘోరం చోటు చేసుకుంది. ఓ బాలికను మాయ చేసి హాస్టల్‌ లో ఉండే కరస్పాండెంట్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగు చూసింది. హాస్టల్ లోనే ఉంటున్న 15 ఏళ్ల మైనర్ బాలికపై అతను చాలా సార్లు అత్యాచారం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కాకినాడ టూ టౌన్ పోలీసులు వెల్లడించారు.


కాకినాడ పట్టణానికి చెందిన 15 ఏళ్ల బాలిక 9వ తరగతి చదువుతోంది. అందుకోసం కొండయ్య పాలెంలోని హెల్పింగ్ హ్యాండ్స్ అనే ప్రైవేటు హాస్టల్‌లో ఉండి పక్కనే ఉన్న మరో స్కూలులో చదువుకుంటోంది. 6వ తరగతి నుంచి ఆమె అక్కడే ఉంటోంది. కొన్నాళ్ల క్రితమే ఆమె తండ్రి చనిపోయాడు. దీంతో తల్లే ఆమెను చూసుకుంటోంది. ప్రస్తుతం ఆ బాలిక 9వ తరగతి రాసింది. ఆ ప్రైవేటు హాస్టల్‌లో పర్యవేక్షకుడిగా కరెస్పాండెంట్ కొత్తపల్లి విజయ్ కుమార్ అనే 60 ఏళ్ల వ్యక్తి ఉన్నారు. 


గత ఏప్రిల్ లో మాయమాటలు చెప్పి బాలికపై చాలా సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అతను బాలికను తన గదిలోకి తీసుకెళ్లి కరోనా రాకుండా తన దగ్గర మందు ఉందని చెప్పి ఏవో మందు బిళ్లలు ఇచ్చాడు. ఆ తర్వాత తనకు బాగా మత్తు వచ్చేసిందని బాలిక పోలీసులకు చెప్పింది. అయితే, ప్రస్తుతం ఎండాకాలం సెలవుల సందర్భంగా స్కూలుకు సెలవులు. దీంతో కొద్ది వారాలుగా బాలిక ఇంటి వద్దనే గడుపుతోంది. ఈ క్రమంలోనే ఆమెకు మూడు రోజులుగా రక్త స్రావం అవుతోంది. తల్లి ఈ విషయం గమనించి అడగ్గా.. ఈ విషయం బయటపడింది. చికిత్స కోసం ఆమెను ఈ నెల 1న కాకినాడలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. 


అయితే, బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆమెకు గర్భస్రావం అయిందని డాక్టర్లు తెలిపారు. అందుకే రక్త స్రావం జరిగిందని వెల్లడించారు. శనివారం టూ టౌన్ పోలీసులు చిన్నారితో మాట్లాడారు. ఆమె తల్లి వద్ద కూడా వాంగ్మూలాన్ని తీసుకొని కేసును నమోదు చేశారు. నిందితుడు విజయ్ కుమార్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా సంచలనంగా మారింది. ఆ హాస్టల్‌లో ఉంటున్న మిగతా బాలికల తల్లిదండ్రులు ఈ ఘటన తెలిసి ఆందోళన చెందుతున్నారు.


Also Read: Srikakulam: రెండేళ్ల కొడుకుకి ఉరేసిన కన్న తల్లి, ఆ తర్వాత తాను కూడా - శ్రీకాకుళంలో దారుణం


Also Read: Rape On Cow : చివరికి ఆవును కూడా వదల్లేదు - రేప్ చేస్తూ సీసీ కెమెరాకు చిక్కేశాడు !