Hanumakonda District: సుపారీ ఇచ్చి మరీ భర్తను హత్య చేయించింది మొదటి భార్య. అయితే పోలీసులు రెండో భార్యను కూడా అనుమానించారు. కానీ చివరకు 71 రోజుల తర్వాత ముగిసిన మర్డర్ మిస్టరీని హన్మకొండ జిల్లా పోలీసులు ఛేదించారు. భర్తను హత్య చేయించిన భార్యతో పాటు మరో ముగ్గురు నిందితులను కాజీపేట పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి పోలీసులు ఒక కారు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలు సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్ కుమార్ వెల్లడించారు. జిన్నారపు వేణు కుమార్ హత్య కేసులో A1 జిన్నారపు సుస్మిత, A2 కొంగర అనిల్ , A3 గడ్డం రత్నాకర్, A4 కటిక నవీన్ కుమార్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా డిసిపి వెల్లడించారు. 


ఇద్దరు భార్యలున్నా, మరో మహిళతో రిలేషన్ ! 
జిన్నారపు వేణు కుమార్ చిట్టీలు, గిరి గిరిలు నిర్వహిస్తూ కాజీపేటలోని డీజిల్ కాలనీలో కుటుంబంతో నివాసం ఉండేవాడు. మృతుడికి ఇద్దరు భార్యలు. ప్రధాన నిందితురాలైన మొదటి భార్య జిన్నారపు సుస్మిత కాజీపేట రైల్వేలో లోకో పైడ్ లో టెక్నీషియన్ గా పనిచేస్తుంది. రెండో భార్య సంతోష ఇంటి వద్దనే ఉంటుంది. మొదటి భార్యకు ఇద్దరు ఆడపిల్లలు కాగా రెండో భార్యకు ఒక కుమారుడు ఉన్నారు. మీరందరూ డిజిల్ కాలనీ నివాసం ఉండేవారు. గత కొద్ది రోజులుగా మృతుడు వేణు కుమార్ మహబూబాబాద్ లో మరో మహిళతో శారీరక సంబంధం కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారంతో నిందితురాలైన మొదటి భార్య సుస్మిత వేణు కుమార్ మధ్య తరచూ గొడవలు జరుగుతున్నా, మరో మహిళతో మాత్రం సంబంధాన్ని వదులుకోలేదు. పైగా తన ఇద్దరు భార్యలను మానసికంగా శారీరకంగా హింసిస్తూ, తన ఇద్దరు భార్యలను దూరం పెట్టేశాడు. దీంతో తన భర్తకు బుద్ధి చెప్పాలని నిందితురాలైన మొదటి భార్య సుస్మిత నిర్ణయించుకుంది. 


సేమియాలో స్లీపింగ్ టాబ్లెట్ లు ఇచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్ళగానే అనిల్ కు సమాచారం ఇచ్చింది. మరుసటి రోజు కాజీపేట పోలీసులకు తన భర్త కనిపించడం లేదని పిర్యాదు చేసింది. రెండ్రోజులకు ఓసారి పీఎస్‌కు వెళ్లి కన్నీరు కారుస్తూ భర్తపై ఎనలేని ప్రేమ వొలకబోసేది. ఇలా ఒకటి, రెండు కాదు దాదాపు 71 రోజుల పాటు భార్య ఆచూకీ చెప్పాలని ప్రాధేయపడుతూ నటవిశ్వరూపం చూపెట్టింది. కానీ, మొబైల్‌ ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా ఆమె గుట్టు కనిపెట్టిన పోలీసులు అసలు నిజం తెలిసి కంగుతిన్నారు. వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ కాజీపేట పోలీసు డివిజన్‌ పరిధిలో జరిగిన క్రైమ్‌ కథలో మృతుని రెండో భార్య పాత్రపై కూడా అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. 


భర్త అడ్డుతొలగించుకునేందుకు అనిల్‌తో కలిసి సుష్మిత పథకం వేసింది. ఇందులో భాగంగా, అనిల్‌, మరో ముగ్గురు కలిసి సెప్టెంబరు 30న అపస్మారక స్థితిలో ఉన్న వేణు కుమార్ ను ఓ కారులో ఎక్కించుకుని కాళేశ్వరం - మంథని మధ్య ఉన్న అడవుల్లోకి తీసుకెళ్లారు. వేణుప్రసాద్‌ను హత్య చేసి అక్కడే మానేరు వాగులో పడేశారు. ఇదేమీ తెలియనట్టుగా నటించిన సుష్మిత అక్టోబరు 1న తన పిల్లలతో కలిసి పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తన భర్త ఆచూకీ చెప్పిన వారికి బహుమతులు ఇస్తానని సోషల్‌ మీడియాలో పోస్టులు కూడా పెట్టింది. రెండ్రోజులకు ఓసారి పోలీసుస్టేషన్‌కి వెళ్లి భర్త ఆచూకీ కోసం వాకబు చేసేది. ఈ క్రమంలో పోలీసుల ఎదుట కన్నీరు పెట్టుకుని ప్రాధేయపడేది. సుష్మిత నటనను నమ్మిన పోలీసులు కూడా ఆమెను ఓదార్చి పంపేవారు.


పట్టించిన సెల్‌ఫోన్‌ సిగ్నల్‌..
మిస్సింగ్‌ కేసు నమోదు చేసి వేణుకుమార్ కోసం గాలిస్తున్న పోలీసులకు సుష్మితపై ఎక్కడో అనుమానం రాగా, సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆమె గుట్టును బయటపెట్టింది. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన రోజు వేణుకుమార్ మొబైల్‌ ఫోన్‌ వెంట తీసుకెళ్లాడని ఓ సందర్భంలో పోలీసులకు చెప్పింది. అయితే, సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులు ఆ సెల్‌ఫోన్‌ సుష్మిత ఇంట్లోనే ఉన్నట్టు గుర్తించారు. ఈ మేరకు వారం రోజుల కిందట వేణుకుమార్ లో ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు అతడితోపాటు సుష్మ సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆయా ఫోన్ల కాల్‌ డేటాను పరిశీలించగా అసలు నిజం బయటపడింది. దీంతో సుష్మితను విచారించిన పోలీసులు మూడు రోజుల కిందట అనిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. సుష్మిత చెప్పడంతోనే మరో ముగ్గురితో కలిసి వేణుకుమార్ ను చంపానని అనిల్‌ పోలీసులకు వెల్లడించాడు.


భర్త హత్య కోసం సుపారీ 
భర్త జిన్నారపు వేణు కుమార్ మర్డర్ కోసం సుస్మిత వద్ద అనిల్ 4 లక్షల రూపాయల డీల్ కుదర్చుకున్నట్లు డీసీపీ వెల్లడించారు. ముందు రెండు లక్షలు తర్వాత రెండు లక్షల ఒప్పందం కుదుర్చుకున్నట్లు డీసీపీ తెలిపారు. ఈ కేసును చాలా చాకచక్యంగా ఛేదించిన కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, సిఐ మహేందర్ రెడ్డి, ఎస్ఐలు ప్రమోద్ కుమార్, రవికుమార్, వెంకటేశ్వర్లు, సల్మాన్ లను డీసీపీ అభినందించారు.