Jangareddygudem Knife Attack : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగుడెంలో దారుణ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన ఓ కుటుంబంపై  గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. భార్య భర్తతో పాటు  చిన్నారిని కూడా కత్తితో దాడిచేశారు ఆగంతకులు. తీవ్రగాయాల పాలైన ఆ ముగ్గురు ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారని వైద్యులు తెలిపారు. జంగారెడ్డిగూడెం  ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు. ఈ  ఘటనపై మైసన్నగూడెంలో పోలీసులు విచారణ చేపట్టారు.  


అసలేం జరిగింది? 


 ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెంలో ఆదివారం ఓ కుటుంబంపై ఆగంతకులు కత్తులతో దాడి చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మైసన్నగూడెం గ్రామానికి చెందిన తోనం శివ(28), అతని భార్య చిన్ని(26), కుమారుడు మంగరాజు(11)లపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఆదివారం తెల్లవారుజామున శివ రోజులాగానే పొగాకు సేకరణ పనికి వెళ్లాడు. కొంత సమయం తర్వాత పనిచేస్తున్న చోటే శివపై దాడి జరిగింది. అతడు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని స్థానికులు గమనించాడు. ఈ విషయాన్ని శివ భార్యకు తెలిపేందుకు అతడి వెళ్లగా.... ఇంటి వద్ద శివ భార్య చిన్ని, కుమారుడు మంగరాజు కూడా రక్తపు మడుగులో పడిఉండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే శివ బంధువులకు సమాచారం అందించారు. తీవ్ర గాయాల పాలైన శివ, చిన్ని, మంగరాజును జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వీరి ముగ్గురి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ దాడి ఘటనపై సమాచారం అందుకున్న జంగారెడ్డిగూడెం పోలీసులు శివ ఇంటిని పరిశీలించి విచారణ చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిపై దాడి జరగడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.  


కానిస్టేబుల్ బ్లేడుతో దాడి 


బాపట్ల జిల్లా‌ పిట్టలవానిపాలెం సంగుపాలెం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. బాపట్ల ఎమ్మెల్యే కోనా రఘుపతి నిర్వహించిన జగనన్న రుణమాఫీ కార్యక్రమానికి... డ్వాక్రా సంఘాల మహిళలను తీసుకు వెళ్లింది సంగుపాలెం గ్రామ డ్వాక్రా యామినేటర్  జీవకుమారి. అయితే పెద్ద సంఖ్యలో డ్వాక్రా హిళలను యామినేటర్ తరలించడంతో గ్రామ సర్పంచ్, ఆయన కుమారుడు.. జీవ కుమారిని టార్గెట్ చేశారు. ఈ క్రమంలోనే తమ అనుమతి లేకుండా ఎందుకు తీసుకెళ్తున్నావంటూ సర్పంచ్ జీవకుమారితో వాగ్వాదానికి దిగారు. గొడవ ఎందుకంటూ అడ్డుగా వచ్చిన యానిమేటర్ భర్త శ్రీనివాసరావు పై దాడి చేశారు. విషయం గుర్తించి వచ్చిన స్థానికులు నచ్చజెప్పగా ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. ఈ  ఘటన గురించి తెలుసుకున్న సర్పంచ్ కుమారుడు మహేష్... బజారుకు వెళ్లి వస్తున్న శ్రీనివాసరావుపై బ్లేడుతో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో శ్రీనివాసరావు కుడి చెవి తెగిపోయింది. అయితే విషయం గుర్తించిన స్థానికులు ఇద్దరినీ ఆపారు. అనంతరం శ్రీనివాస రావును పొన్నూరు గవర్నమెంట్  ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించి.. పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. . బ్లేడుతో దాడి చేసిన సర్పంచ్ కుమారుడు మహేష్ పొన్నూరులో  పోలీస్‌ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. తమకు తన కుటుంబ సభ్యులకు సర్పంచ్, అతని కుమారుడు నుంచి ప్రాణహాని ఉందని శ్రీనివాస రావు భార్య జీవకుమారి చెబుతోంది. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని కోరుతుంది. అలాగే నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తోంది.