"ప్రజలు అడ్డుకుని ఉంటే రమ్య బతికి ఉండేదేమో!" అని గుంటూరు రేంజ్ ఇంచార్జి డీఐజీ రాజశేఖర్ బాబు నిందితుడ్ని మీడియా ముందు ప్రవేశపెట్టే సమయంలో వ్యాఖ్యానించారు. రమ్యను హంతకుడు నడిరోడ్డుపై కత్తితో పొడుస్తున్న సీసీ కెమెరా దృశ్యాలు చూసిన వారిలో ఎక్కువ మంది అభిప్రాయం కూడా అదే. అంత మంది అక్కడ ఉన్నా ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ హంతకుడ్ని అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడంతో.. నింపాదిగా హత్య చేసి వెళ్లిపోయాడు హంతకుడు. అక్కడున్న ఎవరికీ మానవత్వం లేదని కొందరు నిందిస్తూంటే.. పోలీసు ఉన్నతాధికారులు కూడా ప్రజలు కనీస కర్తవ్యం మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా హత్య జరుగుతున్నా చూస్తూ అడ్డుకోని ప్రజలదేనా తప్పు..!?


ప్రజల్లో తగ్గిపోతున్న స్పందించే గుణం..! 


22ఏళ్ల కిందట శివయ్య అనే సినిమా వచ్చింది. రాజశేఖర్ హీరో. అందులో హీరో చెల్లిని విలన్లు అత్యాచారం చేస్తారు. ఈ కేసులో ఆ ఘటన జరిగిన చుట్టుపక్కల ప్రజలందరికీ హీరో నోటీసులు పంపిస్తారు. వారే రేప్ చేశారని ఆ నోటీసుల సారాంశం. అలా హీరో నోటీసులివ్వడానికి కారణం.. ఆ ఘటన జరుగుతున్నప్పుడు అమ్మాయి అన్యాయానికి గురవుతున్నా.. అందరూ చూస్తూ ఉండటమో లేకపోతే.. మనకేం సంబంధం అని వెళ్లి తలుపులు వేసుకోవడమో చేయడం. వారు సమాజం పట్ల కనీస బాధ్యత కూడా చూపకపోవడం వల్లే తన చెల్లికి అలాంటి పరిస్థితి వచ్చిందని హీరో భావన. కోర్టులోనూ అదే చెబుతారు. నిజానికి హీరో చెల్లికి ఆ పరిస్థితి రావడానికి కారణం ఆ చుట్టుపక్క జనం కోసం పోరాడటమే. ఇది కూడా అందర్నీ బాధ్యుల్ని చేయడానికి కారణం. ఆ సినిమాలో హీరో ఆవేదన ఇప్పుడు.. రమ్య తల్లిదండ్రులకు కూడా కలిగి ఉంటుంది. అయ్యో చుట్టుపక్కల ఉన్నవారు స్పందించి ఉంటే తమ బిడ్డ బతికి ఉండేది కదా అని అనుకుని ఉంటారు. ఇతరులూ అదే చెబుతున్నారు. 


ప్రజల్ని నిందించడం సులువే .. కానీ వ్యవస్థలు పని చేస్తున్నాయా..?


నిజానికి ఇలా నిందించడం చాలా సులువు. ఇలా నిందించేవారికి ఎవరైనా ఆపదలో ఉన్న వారు ఎదురుపడితే సాయం చేసేవారు చాలా తక్కువ. నిజంగా ఇలా హత్యలు జరుగుతూంటే ఎదురెళ్లి ఆపాలని అనుకునేవారు చాలా చాలా తక్కువ. తిరిగి తమను కొడతారని.. చంపుతారనే భయం వారికి కూడా ఉంటుంది. ఆ దండగుడ్ని ఎదుర్కోగలం అని నమ్మకం ఉండాలి. వారిలో కాపాడాలనే మంచితనం కూడా ఉన్నప్పుడే..  ఆపదలో ఉన్న వారికి కాస్త మంచి రోజు అవుతుంది. కానీ ప్రస్తుత సమాజంలో అలాంటి వారు చాలా తక్కువ అయిపోయారు. అందుకే నడిరోడ్డుపై ఏం జరుగుతున్నా పట్టించుకునేవారు లేరు.


నిందితుడు రమ్యపై దాడి జరుగుతున్నప్పుడు చుట్టూ జనం చూస్తున్నారు. అక్కడ ఏదో గొడవ జరుగుతుందే అని ఇంట్రస్టింగ్‌గా చూస్తున్నారు. కానీ ‍ఒక్కరంటే ఒక్కరు కూడా అసలు తెలుసుకోవడానికి ట్రై చేయలేదు. గొడవ చూడటానికి ఉన్న ఆసక్తి... ఆపేందుకు చేయడం లేదు. రేపొద్దన్న మన ఫ్యామిలీ మెంబర్స్‌ ‌అలాంటి పరిస్థితిలో ఉంటే అన్న ఆలోచన కూడా రావడం లేదు. నిందుతుడు రమ్యను చంపడానికి ముందు చాలా సేపు ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఇంతలో ఎవరైనా ఒక్కరు అక్కడ గొడవేంటి... ఆ అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావని అడిగి ఉంటే.. ఇవాళ రమ్య బతికి ఉండేదేమో అన్న చర్చ నడుస్తోంది. 


ఇలాంటి సంఘటనలు చూసి లైట్ తీసుకుంటున్న కొందరు ప్రజలు... ప్రభుత్వాలను, పోలీసులను మాత్రం నిందిస్తుంటారు. వ్యవస్థలనే నిందిస్తున్న వారంతా తమ తప్పులను గుర్తించడం లేదు. మరోవైపు పోలీసులు కూడా ఫిర్యాదు వస్తేనే స్పందిస్తామంటున్నారు. ఇది చెప్పుకోవాలన్నా కటువుగా ఉండే విషయం. తమకు ఫిర్యాదు వస్తే ఏమైనా చేసేవాళ్లమని ఫిర్యాదు రాలేదని తమ తప్పు లేదని చెప్పుకోవడానికి పోలీసులు చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ మౌలికమైన సమస్య ఫిర్యాదు కాదు. 


నేరం చేస్తున్న వారికి ఎందుకు భయం ఉండటం లేదు..!? 


పోలీసు వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు సాధారణంగా నేరాలు చేయాలనుకున్న వారి మదిలో భయం ఉంటుంది. ఆ పోలీసు వ్యవస్థను ఎలాగైనా మేనేజ్ చేయవచ్చని.. తప్పించుకోవచ్చన్న భావన పెరిగిపోతే అది నేరాలు పెరిగిపోవడానికి కారణం అవుతుంది. అప్పటి వరకూ అలాంటి దాడులకు పాల్పడిన వారు స్వేచ్చగా తిరుగుతున్నా అది ప్రమాదకరణ సంకేతాలను పంపుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు వ్యవస్థ పనితీరుపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. హైకోర్టే అనేక సార్లు రూల్ ఆఫ్ లా పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులపై నేరస్తులకు తేలిక భావం ఏర్పడితే ఇలాంటి హత్యలే జరుగుతూ ఉంటాయి. అదే పోలీసుల చర్యలపై భయం ఉంటే... ఆయుధాన్ని కనీసం జేబులో పెట్టుకుని తిరిగే ధైర్యం కూడా చేయలేకపోయేవాడు. 


చుట్టుపక్కల ప్రజలు స్పందించడం లేదని నిందించడం చాలా సులువు. వ్యవస్థలన్నీ సక్రమంగా పని చేస్తే సమస్యలేమీ ఉండవు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలంటే.. అమ్మో.. తమకేం హానీ జరుగుతుందో అని ప్రజలు భయపడుతున్నారు. అలా భయపడాల్సింది ప్రజలు కాదు.. నేరస్తులు. అలాంటి పరిస్థితులు వచ్చిన రోజున సమాజంలో ఇలాంటి నేరాలు తగ్గిపోతాయి. ప్రజల్లో స్పందించే గుణమూ పెరుగుతుంది.