Indian origin man kills father in US :   అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం షాంబర్గ్‌లో దారుణ ఘటన జరిగింది.  భారత మూలాలున్న  యువకుడు తన తండ్రిని  గొడ్డలి వంటి పరికరంతో కొట్టి హత్య చేశాడు.   నవంబర్ 29న  థ్యాంక్స్‌గివింగ్ వీకెండ్న ఈ ఘటన జరిగింది. నిందితుడ్ని  అభిజిత్ పటేల్ గా గుర్తించారు. అతని వయసు 28 ఏళ్లు.  అతని తండ్రి అనుపమ్ పటేల్ ను చంపేశాడు.  వీరంతా కుటుంబంతో కలిసి షాంబర్గ్‌లో నివసిస్తున్నారు.

హత్య జరిగిన రోజున అభిజిత్ తండ్రి పడుకుని ఉన్న గదిలోకి  చిన్న గొడ్డలి తీసుకెళ్లాడు. తండ్రి మేల్కొని ఉండగానే బలంగా దెబ్బలు తీశాడు. ఆయుధాన్ని అక్కడే పడేసి గది నుంచి బయటకు వచ్చాడు. తర్వాత తల్లికి నాన్నను ఓ సారి చూసి రాని అని చెప్పాడు. తల్లి గదిలోకి వెళ్లి చూస్తే అనుపమ్ పటేల్ రక్తమోడుతూ అక్కడే మృతి చెందినట్టు తేలింది. పోలీసులు రాగానే అభిజిత్ స్వయంగా సరెండర్ అయ్యాడు.  తలకు కనీసం రెండు  గొడ్డలి పోట్లు పడ్డాయని  స్కల్ ఫ్రాక్చర్, నోస్ బ్రేక్ అయినట్టు  పోస్టుమార్టంలో తేలింది.  

పోలీసు ఇంటరాగేషన్‌లో అభిజిత్ విచిత్రమైన సమాధానాలు చెప్పాడు. తండ్రి బాల్యంలో తనను  వేధించాడని . దానికి ప్రతీకారంగా హత్య చేయడం తనకు మతపరమైన బాధ్యత  అని చెప్పాడు. అభిజిత్‌కు స్కిజోఫ్రీనియా ఉందని గుర్తించారు.  గతంలో ఈ మానసిక వ్యాధి కారణంగా హాస్పిటల్‌లో కూడా చేరాడు.  ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు. డాక్టర్లు  వేధింపుల ఆరోపణలను  ఊహాత్మకమైనవి అని నిర్ధారించారు. ఘటన సమయంలో అభిజిత్‌పై తండ్రిని కాంటాక్ట్ చేయకూడదని ప్రొటెక్షన్ ఆర్డర్ ఉంది. గతంలో తండ్రిని చంపుతానని బెదిరించిన ఘటనలు ఉన్నాయి. 

అభిజిత్ పటేల్‌పై ఫస్ట్ డిగ్రీ మర్డర్ చార్జ్ పెట్టారు. బెయిల్ లేకుండా జ్యూడిషియల్ కస్టడీలో ఉంచారు.  తల్లిని కాంటాక్ట్ చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. తదుపరి కోర్టు విచారణ డిసెంబర్ 19న జరగనుంది. ఈ దారుణ ఘటన షాంబర్గ్ ప్రాంతంలో ఆందోళన కలిగించింది. మానసిక వ్యాధులు, కుటుంబ హింస వంటి అంశాలపై మరిన్ని చర్చలకు దారితీసింది.