Singapore Crime: 



ఇండియన్‌కి శిక్ష..


ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటాయి చట్టాలు. చిన్న చిన్న తప్పులకే పెద్ద శిక్షలు వేస్తుంటారు. నేరం చిన్నదైనా, పెద్దదైనా నేరస్థుడికి కచ్చితంగా శిక్ష పడాల్సిందే అని కొన్ని ప్రభుత్వాలు తేల్చి చెప్పేస్తాయి. ఇలా చాలా మంది బాధితులవుతుంటారు. సింగపూర్‌లో 40 ఏళ్ల ఇండియన్‌ ఇలాగే శిక్షకు గురయ్యాడు. ఓ పార్టీలో మద్యం మత్తులో ఉండగా ఓ వ్యక్తి చూపుడు వేలు కొరికాడు. ఎక్స్‌కవేటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న తంగరసు రంగసామి మద్యం మత్తులో సహోద్యోగి వేలు కొరికాడు. ఆ బాధితుడు కూడా ఇండియనే. గతేడాది ఏప్రిల్‌లో డార్మిటరీలో ఉండగా ఈ ఘటన జరిగింది. ఈ ఇద్దరూ ఒకే చోట ఉంటున్నారు. రంగసామి అప్పటకి ఫుల్‌గా తాగాడు. గట్టిగా అరుస్తుండటం వల్ల చుట్టు పక్కల వాళ్లు ఇబ్బంది పడ్డారు. ఇదే విషయాన్ని చెబుతూ "అరవొద్దు" అని వారించాడు మరో బాధితుడు రామమూర్తి. ఇలా వార్నింగ్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన తంగరసు గొడవకు దిగాడు. చాలా సేపు వీళ్లిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. పక్కనే ఉన్న వాళ్లు ఆపాలని చూసినా ఆగలేదు. ఈ గొడవలోనే అనుకోకుండా రామమూర్తి ఎడమ చేతి వేలు తంగరసు నోట్లోకి వెళ్లిపోయింది. వెంటనే గట్టిగా కొరికేశాడు తంగరసు. కొన్ని సెకన్ల తరవాత ఎలాగోలా వేలుని బయటకు లాగేసుకున్నాడు రామమూర్తి. విపరీతంగా రక్తం పోవడం వల్ల వెంటనే ఆసుపత్రికి తరలించారు. కొరికేసిన తరవాత ఆ వేలు ముక్క ఎక్కడ పడిందో కూడా తెలియదు. వైద్యులు వేలికి సర్జరీ చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు...నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 10 నెలల జైలు శిక్ష విధించారు. సింగపూర్ చట్టాల ప్రకారం...ఎవరైనా ఇలాంటి దాడులకు పాల్పడితే ఆ నేర తీవ్రతను బట్టి పదేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తారు. 


మహిళకు ఉరి శిక్ష


సింగపూర్ లో ఓ మహిళకు ఉరి శిక్ష పడింది. గడిచిన 20 సంవత్సరాల కాలంలో తొలిసారి శుక్రవారం ఓ మహిళను ఉరి తీసింది సింగపూర్ ప్రభుత్వం. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఇద్దరు దోషులకు సింగపూర్‌ ప్రభుత్వం మరణి శిక్ష విధించింది. 2018లో వీళ్లను అరెస్టు చేశారు.హెరాయిన్‌ ను అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు దోషులను సింగపూర్‌ పోలీసులు 2018లో పట్టుకున్నారు. వారిలో ఒకరు 56 ఏళ్ల వ్యక్తి కాగా అతనిని బుధవారం ఉరి తీశారు. కాగా ఆ వ్యక్తితో పాటు అరెస్ట్‌ అయిన మహిళను శుక్రవారం ఉరి తీశారు. ఉరి తీసిన మహిళ పేరు సారిదేవి దామని. ఆమె వయసు 45 ఏళ్లు. 30 గ్రాముల హెరాయిన్‌ ను అక్రమంగా రవాణా చేసిన కేసులో సారిదేవి దోషిగా తేలడంతో ఆమెకు కూడా 2018లో ఉరిశిక్ష విధించారు. ఇద్దరు వ్యక్తుల ఉరి శిక్ష గురించి వారి కుటుంబాలకు వారం రోజుల ముందుగానే సమాచారం అందించారు. గత 20 ఏళ్లలో సింగపూర్‌లో ఓ మహిళను ఉరితీయడం ఇదే తొలిసారి. 2004 లో ఓ 36 ఏళ్ల మహిళకు డ్రగ్‌ ట్రాఫికింగ్‌ కేసులో ఉరిశిక్ష అమలు చేశారు. 


Also Read: Noida Lift Collapse:లిఫ్ట్‌ కూలి నలుగురు మృతి, ఐదుగురి పరిస్థితి విషమం