Fire Accident at Aurora Pharmaceuticals Private Limited: హైదరాబాద్ : జీడిమెట్లలోని ఆరోరా ఫార్మాసూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందడంతో విషాదం నెలకొంది.  కెమికల్ ల్యాబ్ లో రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని సమాచారం.


అసలేం జరిగిందంటే..
ఎప్పటిలాగే కార్మికులు జీడిమెట్లలోని ఆరోరా ఫార్మాసూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వెళ్లి పనిచేస్తున్నారు. అంతలో ఒక్కసారిగా రియాక్టర్ పేలిపోయింది. నిమిషాల వ్యవధిలో కంపెనీలో మంటలు వ్యాపించి దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ అగ్ని ప్రమాదంలో కంపెనీ ల్యాబ్ లో పనిచేస్తున్న రవీందర్ రెడ్డి(25), కుమార్ (24)  ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.  చనిపోయిన వారి మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి  తరలించారు. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న మీడియా ను లోపలికి అనుమతించని కంపెనీ యాజమాన్యం. అయితే బుధవారం ఉదయం ప్రమాదం జరిగినా యాజమాన్యం విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు సమాచారం.