Hyderabad workers died: జీడిమెట్ల: మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో విషాదం చోటుచేసుకుంది. ఓ నిర్మాణ సంస్థ నిర్లక్ష్యానికి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.


కొంపల్లిలో ఆర్‌ఆర్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ భవనాల నిర్మాణాలు చేపడుతోంది. ఈ నిర్మాణ సంస్థలో పనిచేస్తోన్న ఇద్దరు కార్మికులు భవనం పనుల్లో భాగంగా కిందకు దించుతుండగా గ్రానైట్‌ రాయి మీద పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర రక్తస్రావమైన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కార్మికులను పరీక్షించిన వైద్యులు అప్పటికే వీరు చనిపోయారని నిర్ధారించారు. RRR కన్‌స్ట్రక్షన్ సంస్థ కనీస జాగ్రత్తలు పాటించకుండా కార్మికులతో పని చేయించడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని తోటి కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇకనుంచైనా తమ ప్రాణాలకు అపాయడం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మేనేజ్ మెంట్ ను కోరారు. మృతులను ఝార్ఖండ్‌ కు చెందిన శితశరణ్‌ (36), మధ్యప్రదేశ్‌కు చెందిన లక్ష్మణ్‌ బరాక్‌(25)గా గుర్తించారు. ఈ ప్రమాదంపై పేట్ బషీర్ పేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.