Hyderabad Ameerpet Dating App Fraud: ఆన్ లైన్‌లో ఓ వైపు సైబర్ మోసాలు పెరుగుతూ ఉంటే, ఆఫ్ లైన్‌లోనూ అంతకుమించిన అతి తెలివి ప్రదర్శించి పలువురు డబ్బులు దోచుకుంటున్నారు. యువకుల బలహీనతలే పెట్టుబడిగా చేసుకొని పేట్రేగిపోతున్నారు. తాజాగా అమీర్ పేట్ ‌లో వెలుగులోకి వచ్చిన మోసం ముక్కున వేలేసుకొనేలా చేసింది. తనను మోసం చేసిన వారు నకిలీ పోలీసులు అని తెలుసుకొని, తాను మోసపోయానని గ్రహించి బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. హైదరాబాద్‌లోని అమీర్ పేటలో బల్కంపేట రోడ్డులో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓ అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన ఓ యువకుడిని నకిలీ పోలీసులు బురిడీ కొట్టించారు. అతని బలహీనతనే నిందితులు తమ పెట్టుబడిగా వాడుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ముమ్మిడివరానికి చెందిన యువకుడు హైదరాబాద్ నగరంలోని బల్కంపేట రోడ్డులో ఓ అపార్ట్‌ మెంట్‌లో ఉంటున్నాడు. వారంలో కొద్ది రోజులు ఆఫీసుకు వెళ్లి వస్తూ మిగతా రోజులు ఇంటి నుంచే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. 


అయితే, అతను యువతుల కోసం ఓ డేటింగ్ యాప్‌ను ఆశ్రయించాడు. అందులో ఉన్న యువతుల ప్రొఫైల్స్ తో చాట్ చేసి, కలుసుకుందామని మాట్లాడుకున్నాడు. అందుకోసం బీకే గూడలోని ఓ అపార్ట్‌మెంట్‌కు రావాలని అవతలి వ్యక్తి సూచించడంతో అక్కడికి వెళ్లాడు. చెప్పిన అడ్రస్ లో ఇద్దరు అమ్మాయిలతో యువకుడు మాట్లాడుతుండగా, సరిగ్గా అదే సమయంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి వచ్చారు. తాము పోలీసులం అంటూ బెదిరించి, దౌర్జన్యంతో అతని సెల్‌ ఫోన్‌ ను లాగేసుకున్నారు. బలవంతంపైన ఫోన్‌ పే యాప్ ద్వారా తమ ఖాతాలోకి తన అకౌంట్‌లో ఉన్న మొత్తం రూ.14,500 ట్రాన్స్‌ ఫర్ చేయించుకున్నారు. అంతేకాక, సెల్‌ ఫోన్ ను కూడా తీసుకుని అక్కడి నుంచి పరారీ అయ్యారు. 


దీంతో అనుమానం వచ్చిన యువకుడు తాను మోసపోయానని గ్రహించి వెంటనే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. బాధిత యువకుడి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా వెల్లడించారు.


బంజారాహిల్స్‌లో వ్యభిచారం గుట్టురట్టు
రెండు రోజుల క్రితం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతూ ఉన్న ఓ వ్యభిచార రాకెట్ ను పోలీసులు భగ్నం చేశారు. తమకు విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు వ్యభిచార గృహంపై వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం (అక్టోబరు 15) దాడి చేశారు. బంజారాహిల్స్ లోని రోడ్ నెంబరు 11లో అల్ - కరీమ్ అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌ ను అద్దెకు తీసుకొని విటులను వివిధ పద్ధతుల ద్వారా ఆకర్షిస్తూ నిందితులు ఈ వ్యభిచారం నడిపిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. 


ఈ వ్యభిచార ముఠా నిర్వహకురాలు స్వాతి అనే మహిళతోపాటు మరో ఇద్దరు యువతులు, ఓ కస్టమర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిర్వహకురాలు సత్యవతి పరారీలో ఉన్నట్లుగా పోలీసులు చెప్పారు. నిందితులను, యువతులను విచారణ కోసం వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించి అక్కడి పోలీసులకు అప్పగించారు.