Hyderabad Crime News: హైదరాబాద్ శివారులో ఓ వ్యాపారిని దుండగులు దారుణంగా పొడిచి చంపారు. హతుడు ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి అని పోలీసులు తెలిపారు. అతణ్ని కమ్మరి కృష్ణ అని గుర్తించారు. హైదరాబాద్ శివారు షాద్ నగర్ లోని తన ఫాంహౌస్ నుంచి కమ్మరి కృష్ణ బయటకు వస్తున్న వేళ.. ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసినట్లు తెలిసింది. మూకుమ్మడిగా దాడి చేసి కృష్ణను కిరాతకంగా వారు నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు.


ఘటన జరిగిన వెంటనే నిందితులు అక్కడి నుంచి పరారీ అయ్యారు. బుధవారం (జూలై 10) మధ్యాహ్నం తర్వాత ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ మొదలుపెట్టారు. కమ్మరి కృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఈయన కన్వెన్షన్ సెంటర్లు, ఫాంహౌస్ నిర్మాణాలు చేస్తూ కేకే గా గుర్తింపు పొందారని పోలీసులు చెప్పారు. బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ హైదర్ షాకోట్ లో ఈయన నివాసం ఉంటారని తెలిసింది.


కమ్మరి కృష్ణ హత్య షాద్ నగర్ దగ్గర్లోని కమ్మదనం ప్రాంతంలో ఉన్న తన సొంత కేకే ఫాంహౌస్ లోనే జరిగింది. నిందితులు రెక్కీ నిర్వహించి.. పక్కా ప్రణాళికతో హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. చికిత్స కోసం కేకేను శంషాబాద్ లోని ట్రైడెంట్ హాస్పిటల్ కు తరలించగా.. మధ్యలోనే చనిపోయాడు. అయితే, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తగాదాలే హత్యకు కారణం అని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.