Hyderabad Drugs : హైదరాబాద్ న్యూ ఇయర్ తనిఖీల్లో పాతనేరస్థులు పట్టుబడ్డారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పోలీసులు చేపట్టిన తనిఖీల్లో డ్రగ్స్‌ కేసులో పాత నేరస్థులు చిక్కారు.  రాంగోపాల్ పేట్‌లో నవంబర్ 3న నమోదైన కేసులో మోహిత్ అగర్వాల్, మన్యం కృష్ణ కిషోర్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో నిందితులిద్దరూ పరారీలో ఉన్నారు. వీరిని హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసుల సహకారంతో రాంగోపాల్ పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 3 గ్రాముల కొకైన్, రెండు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు. 


ఎడ్విన్ తో సంబంధాలు 


డ్రగ్స్ కేసులో కీలక నిందితుడైన మోహిత్ అగర్వాల్... ఇంటర్నేషనల్ డీజే ఈవెంట్లు నిర్వహిస్తున్నాడు. హైదరాబాద్, ముంబయి, గోవా, బెంగళూరులో పార్టీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని పబ్‌లలో కూడా మోహిత్ ప్రైవేట్ పార్టీలు నిర్వహిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఇలా పార్టీలు నిర్వహిస్తూ పలువురి మోహిత్ డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్‌ కేసుల్లో కీలక నిందితుడైన ఎడ్విన్‌తో కూడా మోహిత్‌కు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాంగోపాల్ పేట్ డ్రగ్స్ కేసులో నిందితుడు హైదరాబాద్‌లో కేఎంసీ ప్రైవేట్‌ లిమిటెడ్ సంస్థను నిర్వహిస్తున్న మన్యం కృష్ణ కిషోర్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పబ్బుల్లో పార్టీలకు హాజరయ్యే కిషోర్ డ్రగ్స్‌కు  బానిసయ్యాడని పోలీసులు చెప్పారు. డ్రగ్స్‌ తీసుకునేందుకు కిషోర్ తరచూ గోవా వెళ్లి వస్తుంటాడన్నారు. ఎడ్విన్‌తో కిషోర్ కు కూడా పరిచయాలు ఉన్నట్లు తెలిపారు.  


బెంగళూరు నుంచి డ్రగ్స్ 


ఓ వ్యక్తి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ను పంపిస్తున్నాడని, అతనికి కృష్ణ కిషోర్‌ డబ్బులను పంపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆదివారం బంజారాహిల్స్ లో కృష్ణ కిషోర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద రెండు గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. డ్రగ్స్ కేసులో నిందితుడు మోహిత్ అగర్వాల్ భార్య సినీ నటి నేహదేశ్ పాండే, ఆమె పలు తెలుగు సినిమాల్లో నటించారు.


మాజీ మంత్రి బంధువు అరెస్టు 
 
ఏపీ మాజీ మంత్రి బంధువు ఒకరు డ్రగ్స్ కేసులో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్‌లోని ఓ పబ్ లో అతడు డ్రగ్స్ తీసుకుంటుండగా పోలీసులకు చిక్కాడు. పబ్‌లో డ్రగ్స్ తీసుకుంటూ ఉండగా పోలీసులు అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మన్యం కృష్ణ కిషోర్ రెడ్డితో ఇంటర్నేషనల్ డీజే ఈవెంట్ మేనేజర్ మోహిత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరి నుంచి  పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. గోవాతో పాటు సన్ బర్న్ పోగ్రాంలను మోహిత్ డ్రగ్స్ ఏర్పాటు చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. మోహిత్ దగ్గర వందకు పైగా డీజేలు ఉన్నట్లుగా తెలిపారు.  మన్యం కిషోర్ రెడ్డి ఏపీ, తెలంగాణలో పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లోని పలు పబ్‌లకు, అలాగే సినీ వ్యాపారవేత్తలకు కిషోర్ రెడ్డి డ్రగ్స్ సరఫరా చేసినట్లు తెలుస్తోంది. కిషోర్ రెడ్డి బెంగుళూరు నుంచి డ్రగ్స్ తెప్పిస్తున్నట్టు గుర్తించారు.