Hyderabad News: హైదరాబాద్ లో ఉండి చదవుకుంటూ తనకు వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్న చిన్న పిల్లల ఆశ్లీల వీడియోను చూస్తున్నాడు. అది చాలదన్నట్లు మరికొన్ని గ్రూపులకు షేర్ చేస్తున్నాడు. గత రెండేళ్ల నుంచి ఇలాగే చేస్తున్న ఓ వ్యక్తి నంబర్ ను అమెరికన్ దర్యాప్తు సంస్థ హోమ్ లాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ గుర్తించింది. ఈ విషయాన్ని పలు దర్యాప్తు సంస్థల ఆధారంగా రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు చేరవేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లికి చెందిన 24 ఏళ్ల యువకుడు హైదారాబాద్ లో ఉంటూ చదువుకుంటున్నాడు. రామాంతపూర్ లో నివాసం ఉంటూ ఎంసీఏ మూడో సంవత్సరం చదువుతున్నాడు. రెండేళ్ల నుంచి ఐదు వాట్సాప్ గ్రూపుల ద్వారా తనకు వస్తున్న అశ్లీల వీడియోలను డౌన్ లోడ్ చేసుకొని చూస్తున్నాడు. అలాగే వాటిని వేరే గ్రూపుల్లో ఫార్వాడ్ చేస్తూ తన స్నేహితులు కూడా చూసే విధంగా చేస్తున్నాడు. అయితే ఈ విషయాన్ని అమెరికాలోని సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ సంస్థ గుర్తించింది. వీడియోలు ఫార్వర్డ్ చేస్తున్న నంబర్ ను గుర్తించి, భారత్ లోని సంబంధిత దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇవ్వాలని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి లేఖ రాసింది. రాయబార కార్యాలయం ఈ విషయాన్ని సీబీఐకి తెలియజేసింది. సీబీఐ తెలంగాణ సీఐడీకీ విషయం చెప్పగా.. ఈ ఫోన్ నెంబర్ ఆధారంగా ఇన్ స్పెక్టర్ బృందంతో దర్యాప్తు చేయించిన సీఐడీ.. నిందితుడు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నట్లు గుర్తించింది. ఈక్రమంలోనే తదుపరి చర్యలు తీసుకోవాలంటూ రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ కు అందించింది. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.