Hyderabad News: హైదరాబాద్ లోని మియాపూర్ లో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఇళ్లు కొనుక్కోవాలనుకున్న వారి నుంచి కోట్లు కొల్లగొట్టి చివరకు చేతులెత్తేసింది. జానీ బాషా షేక్ అనే వ్యక్తి మైత్రి ప్రాజెక్ట్స్ రియల్ ఎస్టేట్ పేరుతో ఓ కంపెనీని ప్రారంభించాడు. ఆయనే ఎండీగా వ్యవహరిస్తూ.. రాయల్ ప్యారడైజ్ పేరుతో వెంచ్ ఏర్పాటు చేసి రూ.50 కోట్లు ఎగ్గొట్టారు. దీంతో ఇళ్లు కొనేందుకు డబ్బులు కట్టిన బాధితులు మియాపూర్ లోని మైత్రి ప్రాజెక్ట్స్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. సంస్థ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేసి 20 రోజులు గడుస్తున్నా వారు ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కొనుగోలు చేయాలనుకున్న తమ వద్ద నుంచి లక్షలు, లక్షలు తీసుకొని మోసం చేశారని కంటతడి పెడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.  


ఇటీవలే రియల్ ఎస్టేట్ పేరిట వ్యక్తి మోసాలు, అరెస్ట్ చేసిన పోలీసులు


మేడ్చల్ జిల్లా కూకట్ పల్లిలో రియల్ ఎస్టేట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు చెందిన కాకర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి జైత్రి ఇన్ ఫ్రా పేరిట కేపీహెచ్బీ 6వ ఫేజ్ లో ఆఫీసు ఏర్పాటు చేశాడు. ఆపై హైదరాబాద్ శివార్లలోని ఖాళీ భూములను వెతికి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి.. అది తన భూమేనని. అక్కడే తాను అపార్ట్ మెంట్లు కట్టబోతున్నట్లు బాధితులను నమ్మిస్తాడు. ప్రీ లాంచ్, ఆఫర్ల పేరిట 2, 3 బీహెచ్ కే ఇళ్లు ఫ్లాట్లు ఇస్తున్నానంటూ.. చాలా మంది బాధితులను మోసం చేశాడు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 5, 10, 15, 20, 25, 40 లక్షల వరకు వసూలు చేసి దాదాపు 20 కోట్ల రూపాయలు కాజేశాడు. డబ్బులు కట్టిన బాధితులు.. ఏళ్లు గడుస్తున్నా ప్లాట్లు ఇవ్వకపోవడంతో బాధితులు శ్రీనివాస్ ను నిలదీశారు. రేపు, మాపని చెప్పగా కొన్నాళ్లు వేచి చూశారు. అప్పటికీ అతని నుంచి ఎలాంటి స్పందన లేకపోయే సరికి బాధితులు మరోసారి శ్రీనివాస్ ఆఫీసుకు వెళ్లి గొడవ చేశారు. ఆ తర్వాత నుంచి శ్రీనివాస్ ఆఫీసును మూసేసి మరీ తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేపీహెచ్బీ సమీపంలోని పీఎన్ఆర్ వద్ద అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇప్పటికే నిందితుడిపై కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో 8 కేసులు నమోదు చేసినట్లు ఏసీపీ చంద్ర శేఖర్ తెలిపారు. 


"కాకర్ల శ్రీనివాస్ అనే ఓ వ్యక్తి జైత్రి ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అని రియల్ ఎస్టేట్ ఆఫీస్ పెట్టి.. ఫ్రీ లాంచ్ పేరిట,  ఆఫర్ల పేరిట 5, 10, 20, 25 లక్షలు వసూలు చేశాడు. మరికొందరి దగ్గర నుంచి అయితే 40 లక్షలు కూడా తీసుకున్నాడు. త్రీ ఇయర్స్ నుంచి ఇలాగే చాలా మంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశాడు. మూడేళ్లు గడుస్తున్నా బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ ప్రారంభం కాకపోవడంతో.. బాధితులు నిలదీశారు. రేపు మాపు అంటూ శ్రీనివాస్ వారిని మోం చేసుకుంటూనే వస్తున్నాడు. బాధితులంతా కలిసి గట్టిగా నిలదీయంతో ఆఫీసును కూడా క్లోజ్ చేసి పారిపోయాడు. దీంతో బాధితులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో మేం అరెస్ట్ చేశాం" - చంద్ర శేఖర్, కేపీహెచ్బీ ఏసీపీ