Google Bomb Hoax Call : పుణేలోని గూగుల్ సంస్థకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో హడావుడి పడిన సంస్థ ఉద్యోగులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆరా తీస్తే ఫేక్ కాల్ అని తెలిసింది. ఎవరో ఆకతాయి ఇలా ఫేక్ కాల్ చేసి బాంబు బెదిరింపు కాల్ చేశాడని పోలీసులు భావించారు. కానీ విచారణలో అసలు విషయం తెలుసుకుని పోలీసులు అవాక్కైయ్యారు. అన్నదమ్ముల ఆస్తి వివాదం గూగుల్ సంస్థకు బెదిరింపు కాల్ వరకు వెళ్లింది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆ కాల్ హైదరాబాద్ నుంచి వెళ్లింది. పుణేలోని గూగుల్ సంస్థకు హైదరాబాద్ చందానగర్ నుంచి బాంబ్ బెదిరింపు కాల్ వెళ్లింది. దీంతో విచారణ చేపట్టిన స్థానిక పోలీసులు చందానగర్ లోని శివానంద్ అనే యువకుడిని అరెస్టు చేశారు. గూగుల్ లో పనిచేస్తున్న తన అన్నను బెదిరించడానికి చేసిన కాల్ బాంబ్ వార్నింగ్ గా మారిందని ఒప్పుకున్నాడు. 


ఆస్తి వివాదాన్ని బాంబ్ బెదిరింపుగా  


హైదరాబాద్ రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని చిత్రపురికాలనీకి చెందిన దయానంద్, శివానంద్ అన్నదమ్ముులు, వీరిద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు.  అయితే వీరి మధ్య ఆస్తి వివాదం తలెత్తింది. హైదరాబాద్ లోని ఓ ఇంటిని అమ్మే విషయంలో ఆస్తి తగాదాలు వచ్చాయి. అన్న దయానంద్ పుణేలోని గూగుల్ క్యాంపస్‌లో వర్క్ చేస్తున్నాడు. ఆదివారం అన్న దయానంద్ కు ఫోన్ చేసిన శివానంద్ ఇంటి విషయమై వాగ్వాదానికి దిగాడు. వారి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. తన మాట వినకపోతే బాంబుతో పేల్చేస్తానని శివానంద్ బెదిరించాడు. దయానంద్ తన తమ్ముడిని ఎలాగైనా ఇరికించాలని ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని గూగుల్ క్యాంపస్ మేనేజర్ కు ఫోన్ చేశాడు. తనకు ఓ ఆగంతకుడు ఫోన్ చేసి గూగుల్ క్యాంపస్ ను పేల్చేస్తానని బెదిరించినట్లు చెప్పాడన్నాడు. ఆగంతకుడి నంబర్ అని చెప్పి తన తమ్ముడు శివానంద్ నంబర్ మేనేజర్ కు ఇచ్చాడు. గూగుల్ క్యాంపస్ మేనేజర్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడి ఫోన్ నంబర్ ను బట్టి సైబరాబాద్ పరిధిలో ఉన్నట్లు గుర్తించారు. సోమవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆస్తి వివాదాన్ని హెచ్చరికను బాంబ్ బెదిరింపు కాల్ గా మార్చినట్లు తెలుసుకున్నారు. 


కుమారుడి పుట్టిన రోజుకు పిలిచి కుమ్మేశాడు
 
కుమారుడి మొదటి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరపాలనుకున్నాడు. ఈ క్రమంలోనే బంధువులు, స్నేహితులందరినీ పిలిచాడు. గ్రాండ్ గా బర్త్ డే సెలబ్రేట్ చేశాడు. ఆపై అంతా కలిసి విందు చేసుకున్నారు. ఈ క్రమంలోనే అతడు ఫుల్లుగా మద్యం సేవించాడు. ఆపై ఇంటికి వచ్చిన బంధువుల్లో ఒక వ్యక్తిని కారు ఇవ్వమని అడిగాడు. అయితే ఇతను ఫుల్లుగా తాగి ఉండడంతో అతను ఇవ్వనని చెప్పాడు. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన సదరు వ్యక్తి.. అందరిపై దాడికి పాల్పడ్డాడు. ఇష్టం వచ్చినట్లుగా దొరికిన వాటితో కొట్టి.. వారందరినీ ఇంట్లో బంధించి తాళం వేశాడు. వారు 100 డయల్ కు ఫోన్ చేసి జరిగినదంతా చెప్పగా పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకొని సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు.  


వికారాబాద్ జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న అత్వెల్లికి చెందిన నవీన్ అనే వ్యక్తి భార్యా, ఓ కుమారుడు ఉన్నారు. అయితే ఫిబ్రవరి 13వ తేదీన వీరి కొడుకు మొదటి పుట్టిన రోజు. కుమారుడి పుట్టిన రోజును ఘనంగా చేయాలనుకున్న తల్లిదండ్రులు.. బర్త్ డే కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. బంధువులతో పాటు స్నేహితులందరినీ పిలిచారు. ఇంటికి వచ్చిన అందరికీ సకల మర్యాదలూ చేశారు. కుమారుడితో కేక్ కూడా కట్ చేయించారు. ఆపై అందరూ విందులో పాల్గొన్నారు. పురుషులు మద్యం సేవించగా.. మహిళలు భోజనం చేశారు. ఇప్పటి వరకూ అంతా బాగానే ఉంది. కానీ నవీన్ ఫుల్లగా మద్యం సేవించాడు. ఇదే పుట్టిన రోజు వేడుకల్లో అల్లకల్లోలం జరిగేలా చేసింది.