Hyderabad Cybercrime POCSO Case registered: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్ చేసిన రెండు యూట్యూబ్ చానల్స్ పై ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ చట్టం కింద కేసు నమోదు అయింది. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో కంటెంట్ క్రియేటర్లు మైనర్లను ఉపయోగించి లైక్లు , వ్యూస్ సాధించే ప్రయత్నాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
పోలీసు కమిషనర్ వి.సి. సజ్జనార్ ఈ విషయంపై రెండు రోజుల కిందటే హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియాలో స్వేచ్ఛ ఉంది కదా అని ఏ తరహా కంటెంట్ అయినా చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. "మైనర్లను ఉపయోగించి అసభ్యకరమైన కంటెంట్ సృష్టించడం చట్టవిరుద్ధం మరియు శిక్షార్హమైనది. ఇలాంటి చర్యలు చైల్డ్ ఎక్స్ప్లాయిటేషన్కు సమానం. ఇటువంటి కంటెంట్ తయారు చేసినవారిపై పోలీసు డిపార్ట్మెంట్ కఠిన చర్యలు తీసుకుంటుంది" అని స్పష్టం చేశారు.
ఈ రెండు యూట్యూబ్ చానల్స్ మైనర్లను ఉపయోగించి అసభ్యకరమైన వీడియోలు తయారు చేసి, వ్యూస్, లైక్లు సాధించే ప్రయత్నం చేస్తున్నాయని పోలీసులు గుర్తించారు. ఇలాంటి కంటెంట్ పోక్సో చట్టం , జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద నేరాలు. పోలీసులు ఈ చానల్స్ పై ఫిర్యాదు అందుకున్న తర్వాత వెంటనే కేసు నమోదు చేసి, ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఇలాంటి కంటెంట్ చూసిన వారు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు రిపోర్ట్ చేయాలి లేదా 1930 హెల్ప్లైన్కు కాల్ చేయాలి లేదా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సజ్జనార్ పిలుపునిచ్చారు.
ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున యూట్యూబ్ చానల్స్.. వ్యూస్ కోసం దిగజారిపోతున్నాయి. ఏఐతో సాయంతోనూ వీడియోలు తీస్తున్నారు. యూట్యూబ్ లో టీజర్ లాగా పెట్టి ప్రమోట్ చేస్తున్నారు. తర్వాత టెలిగ్రామ్ లో రిజిస్టర్ అయితే వీడియోలు పంపుతామంటున్నారు. ఇలాంటి వారి సంఖ్య పెరిగిపోతోంది. వీరందరినీ కట్టడి చేయాలని పోలీసులకు పలువురు నెటిజన్లు సూచిస్తున్నారు.