Hyderabad Crime : 33 కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న మామిడి శెట్టి  సత్యాన్వేష్(27) అనే వ్యక్తిని కేపీహెచ్బీ రమ్య గ్రౌండ్స్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలానగర్ సీసీఎస్, కేపీహెచ్ బీ పోలీసులు సంయుక్తంగా నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు వద్ద నుంచి రూ.21 లక్షల 50 వేల విలువ చేసే 50 ల్యాప్ టాప్ లు, 5 సెల్ ఫోన్లు, ఒక ట్యాబ్ తో పాటు ఐపాడ్ ను స్వాధీనం చేసుకొన్నారు. నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు.



బ్యాచిలర్ రూమ్స్ టార్గెట్ 


రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, హాస్టల్స్, బ్యాచిలర్ రూమ్స్ ను టార్గెట్ గా చేసుకొని నిందితుడు మామిడిశెట్టి సత్యాన్వేష్ చోరీలు చేస్తున్నాడని డీసీపీ తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సత్యాన్వేష్ సికింద్రాబాద్ లో నివాసం ఉంటూ ఈ దొంగతనాలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు డీసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. 


33 కేసులు 


"మామిడిశెట్టి సత్యాన్వేష్ అనే నిందితుడ్ని కేపీహెచ్ బీలో అరెస్టు చేశాం. ఇతనిపై 33 కేసులు ఉన్నాయి. మొత్తం 21 లక్షల విలువైన ల్యాప్ టాప్, ఫోన్లు, రికవరీ చేశాం. ఇతను రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్స్ లో అజాగ్రత్తగా ఉన్న వాళ్లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడతాడు. తాళాలు వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడతాడు. బ్యాచులర్ రూములలో ల్యాప్ ట్యాప్ లు , ఫోన్లు చోరీ చేస్తాడు. ఇతనిది పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం పాందువ్వ గ్రామం. ప్రస్తుతం సికింద్రాబాద్ లో ఉంటున్నాడు. " - బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు


గంజాయి డ్రైవ్ 


అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను చౌటుప్పల్ పోలీసులు పట్టుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 400 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి ఒక డీసీఎం, ఒక కారు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కోటి 50 లక్షలు ఉంటుందని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్ తెలిపారు. మరోకేసులో  10 గ్రాముల హెరాయిన్, ముగ్గురిని అరెస్టు చేశారు ఎల్బీనగర్ ఎస్ఓటి, మీర్ పేట్ పోలీసులు తెలిపారు. 



400 కిలోల గంజాయి స్వాధీనం 


"మాదక ద్రవ్యాలపై రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక డ్రైవ్ చేస్తున్నాం. పక్కా సమాచారంతో గంజాయి ముఠాను అరెస్ట్ చేశాం. అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను చౌటుప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. 400 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నాం. ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్ర కర్ణాటక తరలిస్తున్నట్లు గుర్తుంచాం. డీసీఎం వ్యాన్ లో లోపల ఎవ్వరికి తెలియకుండా గంజాయి తరలిస్తున్నారు. మొత్తం నలుగురు నిందితులను అదుపులోపి తీసుకున్నాం. మెయిన్ కింగ్ పిన్ వీరన్న, సప్లై చేసింది సంతోష్ గా గుర్తించాం. మొత్తం నెట్ వర్క్ ను నిర్మూలించడానికి కృషి చేస్తున్నాం." - డీఎస్ చౌహన్, రాచకొండ పోలీస్ కమిషనర్