Chittoor News : చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతపై దాడి జరిగింది. వైసీపీ పంచాయతీ కన్వీనర్ పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడికి పాల్పడ్డారు. గంగవరం మండలం కీలపల్లిలో ఘటన చోటుచేసుకుంది. సంఘమిత్రను మార్చే విషయమై గొడవ తలెత్తినట్లు తెలుస్తోంది. వైసీపీ పంచాయతీ కన్వీనర్ ఆనందస్వామిపై కత్తితో దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో ఆయనను హుటాహుటిన పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం బెంగుళూరుకు తరలించారు కుటుంబ సభ్యులు.  


నెల్లూరులో వైసీపీ నేతపై దాడి


నెల్లూరులోని బారాషహీద్ దర్గా సమీపంలో వైసీపీ నేత సమీర్ ఖాన్ పై ఇటీవల హత్యాయత్నం జరిగింది. ఆయన్ను మరో మైనార్టీ నేత సయ్యద్ సమీ కత్తితో పొడిచినట్టు సమాచారం. తీవ్ర గాయాలతో ఉన్న సమీర్ ఖాన్ ను నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. సమీర్ ఖాన్ ను మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పరామర్శించారు. సమీర్ ఖాన్ పై దాడి ఘటనను ఖండించారు. నెల్లూరులో ఓ ఎమ్మెల్యే ప్రోత్సహించడం వల్లే మతం ముసుగులో అరాచకవాది పెట్రేగిపోతున్నారని మండిపడ్డారు. యాంటీ సోషల్ ఎలిమెంట్ పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు ఈ వ్యవహారాన్ని తేలిగ్గా వదిలిపెట్టకూడదన్నారు. మైనార్టీ నేత సయ్యద్ సమిని పోలీసులు అరెస్టు చేశారు.  


హయత్ నగర్ లో గ్యాంగ్ వార్ 


హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టిఅన్నారంలో గ్యాంగ్ వార్ జరిగింది. మహేష్ అనే వ్యక్తిపై కత్తులతో దాడి చేశారు. రెండు రోజులక్రితం ఆరుగురు వ్యక్తులు ఒంటరిగా ఉన్న మహేష్ పై పక్కా పథకం ప్రకారం కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ మహేష్  స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసును హయత్ నగర్ పోలీసులు పట్టించుకోవడం లేదని మహేష్ తల్లి ఆవేదన చెందుతున్నారు. 


ప్రేమ పెళ్లి యువకుడి హత్య


 మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దూలపల్లిలోని హనుమాన్ టెంపుల్ వద్ద ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యను కేసును పోలీసులు ఛేదించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అయితే ప్రేమ పేరుతో తన చెల్లిని తీసుకెళ్లిపోయాడని కోపం పెంచుకున్న ఓ అన్న తన స్నేహితులతో కలసి  యువకుడిని దారుణంగా హత్య చేశాడు. అమీర్ పేట్ ఎల్లారెడ్డి గూడకు చెందిన హరీష్(28) కుటుంబం ఆరు నెలల క్రితం సూరారం కాలనీకి మకాం మార్చారు. ఓల్డ్ సిటీ కూల్సుంపురకు చెందిన  మెత్తర్ అనే యువతిని పది రోజుల క్రితం ప్రేమ పేరుతో ఇంట్లోంచి తీసుకువచ్చిన హరీశ్ దూలపల్లిలో మకాం పెట్టాడు.  ఈ విషయం తెలుసుకున్న యువతి అన్న దీందయాల్ తన స్నేహితులతో కలిసి వచ్చి దూలపల్లిలో రెక్కి నిర్వహించాడు. బుధవారం హరీష్  ఉండే దూలపల్లి ప్రాంతంలో కాపు కాశాడు. ముందు యువతిని తన ఇంటికి పంపించేశారు. ఆ తరువాత యువతి అన్న అతని స్నేహితులతో కలిసి హరీష్ పై కత్తులతో దాడి చేశారు. ఛాతి, ముఖంపై దాడి చేసి చంపి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేసి హత్యలో పాల్గొన్న 5 మందిని అదుపులోకి తీసుకున్నారు.