Hyderabad Crime News: ఓ మహిళా వజ్రాల వ్యాపారి వద్ద డ్రైవర్ గా చేరాడు. ఆమె అందరికీ వజ్రాభరణాలు సరఫరా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్నాడు. ఈ క్రమంలోనే భారీ స్కెచ్ వేశాడు. ముందుగా భార్యను బెంగళూరుకు పంపించి.. ఆపై ఇద్దరు కుమారులను అన్న వద్ద ఉంచాడు. ఆపై నగరు సరఫరా చేసేందుకు వెళ్లిన సేల్స్ మెన్ తో వెళ్లిన అతగాడు... సదరు వ్యక్తి కారు దిగగానే కారులో ఉన్న వజ్రాభరణాలతో పరారయ్యాడు. అయితే కారులో ఉన్న వజ్రాభరణాల విలువ 7 కోట్లకు పైమాటే. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నారు. 


అసలేం జరిగిందంటే..?


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరికి జిల్లా కొవ్వూరుకు చెందిన 28 ఏళ్ల శ్రీనివాస్  కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మూడు నెలల కిందటే హైదరాబాద్ కువచ్చిన శ్రీనివాస్ ఎస్సార్ నగర్ సమీపంలోని సాయి హాస్టల్ లో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే మాదాపూర్ లో మైహోం భూజ అపార్ట్ మెంట్స్ లో ఉండే ఓ మహిళా జ్యువెల్లరీ వ్యాపారి రాధిక వద్ద డ్రైవర్ గా పనిలో చేరాడు.  నగరంలోని వివిధ నగల దుకాణం నుంచి వజ్రాభరణాలు కావాల్సిన వారికి రాధిక సరఫరా చేస్తూ ఉంటుంది రాధిక. రోజూ కారులో పెద్ద మెత్తంలో వజ్రాభరణాలు తరలిస్తుంటారు. అయితే విషయం గుర్తించిన శ్రీనివాస్ చోరీకి ప్లాన్ వేశాడు. అయితే మధురానగర్ కు చెందిన అనూషకు రూ.50 లక్షల విలువ చేసే వజ్రాభరణాలను ఇచ్చేందుకు సేల్స్ మెన్ అక్షయ్ తో కలిసి వచ్చిన శ్రీనివాస్.. పథకం ప్రకారమే నగలు ఉన్న కారుతో సహా ఉడాయించాడు.


అక్షయ్ బయటకు వచ్చేసరికి శ్రీనివాస్ కనిపించకపోవడంతో.. మహిళా వ్యాపారికి తెలియజేశాడు. మోసపోయినట్లు గుర్తించిన వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీనివాస్ ఉడాయించిన అరగంటలో కారు నంబరును అన్ని పోలీస్ స్టేషన్లకు పంపి గాలింపు చర్యలు చేపట్టారు. శ్రీనివాస్ కారును ఎక్కడో వదిలి బైక్ పై పరారవుతున్నట్లు గుర్తించారు. శ్రీశైలం రోడ్డు కడ్తాల్ వరకు బైక్ పై శ్రీనివాస్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదండోయ శ్రీనివాస్ చోరీకి ముందే పథకం వేసినట్లు తెలుస్తోంది. రెండు రోజుల ముందుగానే భార్యను బెంగళూరు పంపినట్లు పోలీసులు తెలిపారు. తన ఇధ్దరు కుమారులను సోదరుల వద్ద వదిలాడు. తల్లిదండ్రులు మొత్తం కొవ్వూరులోనే ఉంటున్నారు. 


గత నెలలో నగరంలో వరస చైన్ స్నాచింగ్ లు..


రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇటీవల తెలంగాణ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన చైన్ స్నాచర్లు వరంగల్ లో చిక్కారు. హైదరాబాద్ లో ఆరు చోట్ల స్నాచింగులు జరగడంతో తెలంగాణ పోలీసులు హైఅలర్ట్ అయ్యారు. రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లో నిఘా పెంచారు. పోలీసులు ఊహించినట్టుగానే కేటుగాళ్లు రైళ్లో పారిపోయేందుకు యత్నించారు. అప్పటికే రైల్వే స్టేషన్లలో నిఘా పెంచడంతో వరంగల్ జిల్లా కాజీపేటలో సినీఫక్కీలో పట్టుకున్నారు.  ఉప్పల్, నాచారం, ఓయూ, రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కంత్రీగాళ్లు వరుసగా స్నాచింగులకు పాల్పడ్డారు. రాంగోపాల్‌పేట్  రైల్వే స్టేషన్ సమీపంలో దుండగులు మహిళల మెడలోంచి బంగారు గొలుసులు తెంపుకెళ్లారు. వరుస చైన్ స్నాచింగులతో హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని ప్రజల్లో భయాందోళన నెలకొంది. స్నాచర్లను పట్టుకునేందుకు పోలీస్ బృందాలు రంగంలోకి దిగారు. చైన్ దొంగల కోసం హైదరాబాద్‌లోని అన్ని చోట్ల పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్‌లో పారిపోతుండగా వరంగల్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. కాజీపేట రైల్వేస్టేషన్‌ను దొంగలను పట్టుకున్నారు.