Hyderabad Crime Accused arrested in girl murder case | మేడ్చల్: సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో దసరా పండుగ రోజు దారుణ ఘటన జరిగింది. అదృశ్యమైన ఏడేళ్ల చిన్నారి చివరికి ఓ సంచిలో మృతదేహమై కనిపించడంతో కేసు విషాదాంతమైంది. ఈ కేసును మేడ్చల్ జిల్లా సూరారం పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారించగా, అసలు విషయం వెలుగుచూసింది. వివాహిత మీద కన్నేసి ఆమె కుమార్తెను ఎందుకు హత్య చేశాడో విచారణలో నిందితుడు వివరించాడు.


అసలేం జరిగిందంటే..
మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి బుధవారం మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం పాటగూడ గ్రామానికి చెందిన మిశ్రమ్ ప్రభాకర్ (40) ఏడు నెలల క్రితం హైదరాబాద్ వచ్చాడు. ఇద్దరు కుమార్తెలు ఉన్న గ్రామానికే చెందిన మహిళతో కలిసి కుత్బుల్లాపూర్ పరిధి సూరారం జీవన్ జ్యోతినగర్ లో ఉంటున్నాడు. కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మహిళకు ఇద్దరు కూతుళ్లు కాగా, పెద్ద కూతురు జోష్న వయసు ఏడేళ్లు. 


ఈ క్రమంలో ప్రభాకర్ కు ఆ ప్రాంతానికే చెందిన తిరుపతి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ప్రభాకర్ తన ఇంట్లోనే తిరుపతితో కలిసి తరుచూ మద్యం సేవించేవాడు. ఆ క్రమంలో ప్రభాకర్ ఇంట్లో ఉన్న మహిళపై తిరుపతి కన్నేశాడు. ఇద్దరు పిల్లలు, ప్రభాకర్ అడ్డు తొలగించుకుంటే ఆ వివాహితను తన సొంతం చేసుకోవాలని భావించాడు. తన ప్లాన్ ప్రకారం అక్టోబర్ 12న ఉదయం వివాహిత పెద్ద కుమార్తె (7)ను తన ఇంటికి తీసుకెళ్లాడు. మధ్యాహ్నం తిరుపతి ఆ బాలికను తిరిగి తీసుకొచ్చి ప్రభాకర్ ఇంట్లో వదిలేశాడు. సాయంత్రం మరోసారి ప్రభాకర్ ఇంటికి వచ్చి చూడగా, ఎవరూ లేరని తెలుసుకున్నాడు. దాంతో బాలికకు మరోసారి మాయ మాటలు చెప్పి బైకు మీద తీసుకెళ్లాడు తిరుపతి. అయితే రాత్రి అయినా బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో ప్రభాకర్, మహిళ కలిసి సూరారం పోలీసులను ఆశ్రయించారు. బాలిక అదృశ్యమైందని ఫిర్యాదు చేసి వివరాలు ఇచ్చారు. 


కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రత్యేక బృందాలతో బాలిక ఆచూకీ కోసం గాలించారు. ఈ క్రమంలో మేడ్చల్‌ పోలిస్‌స్టేషన్‌ పరిధి బాసరేగడి గ్రామం సమీపంలో ఓ సంచిలో బాలిక మృతదేహం కనిపించింది. ఆ డెడ్ బాడీ అదృశ్యమైన చిన్నారిదేనని నిర్ధారించారు. బాలిక కనిపించకుండా పోయిన తరువాత నుంచి తిరుపతి జాడ లేకపోవడంతో పోలీసుల ఆ కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. బాలికను బైకు మీద తీసుకెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా ద్వారా గుర్తించిన పోలీసులు మంగళవారం నిందితుడు తిరుపతిని అరెస్ట్ చేశారు.


Also Read: Johnson And Johnson: జాన్సన్‌ బేబీ పౌడర్‌ వాసన పీల్చినా క్యాన్సర్‌!? - తస్మాత్‌ జాగ్రత్త!


నిందుతుడు తిరుపతిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారని మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. చిన్నారిని బైకు మీద తీసుకెళ్లిన తిరుపతి బాసరగడి గ్రామం దగ్గర కత్తితో చిన్నారి గొంతు కోశాడు. కడుపుతో సైతం కత్తితో పొడిచి బాలికను చంపినట్లు నిందితుడు తిరుపతి అంగీకరించాడు. బాలిక మృతదేహాన్ని ఓ సంచిలో మూటకట్టి సమీపంలోని అటవీ ప్రాంతంలో విసిరేసి పారిపోయినట్లు తెలిపాడు.